Saturday, May 4, 2024

Exclusive | భార్య అనుమతి లేకుండా ఆపని చేస్తే నేరం.. సుప్రీంకోర్టులో పిటిషన్​ దాఖలు

వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాలని సుప్రీంకోర్టులో ఓ పిటిషన్​ దాఖలైంది. దీన్ని విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు ధర్మాసనం త్వరలో విచారణ జరపున్నట్టు తెలిపింది. రాజ్యాంగ బెంచ్‌ ముందున్న జాబితా చేసిన పిటిషన్‌ను విచారించిన తర్వాత.. వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాలని దాఖలైన పిటిషన్లపై ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్ విచారించనున్నట్లు సుప్రీంకోర్టు ఇవ్వాల (బుధవారం) తెలిపింది.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ పీఎస్‌ నరసింహ, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాతో కూడిన ధర్మాసనం ఎదుటకు ఈ పిటిషన్​ రాగా, ఈ విషయాలను ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం విచారించాల్సి ఉందని, ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం కొన్ని లిస్టెడ్ అంశాలను విచారించిన తర్వాత జాబితా చేస్తామని సీజేఐ తెలిపారు. కాగా, వైవాహిక అత్యాచారాన్ని నేరంగా తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఇంతకుముందే ఇద్దరు వ్యక్తులు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం భిన్నమైన తీర్పును వెలువరించింది. భార్య సమ్మతి లేకుండా ఆమెతో సంభోగం చేయడం నేరంగా పరిగణించాలన్న పిటిషనర్ల వాదనలతో జస్టిస్‌ శక్ధర్‌ ఏకీభవించారు. ‘భారతీయ శిక్షాస్మృతి నిబంధనల కారణంగా ఈ విషయంలో భర్తలను మినహాయించడం ‘అత్యంత సమస్యాత్మక’ తీర్పు అని ఆయన వ్యాఖ్యానించారు.

ఆడాళ్లకు ఉన్న అనుకూలాంశాలు ఏమిటంటే..

‘‘సెక్స్‌ వర్కర్లు, భర్తల నుంచి విడిపోయిన భార్యలకు.. అత్యాచార నిరోధక చట్టం కింద నిందితులపై కేసులు పెట్టి, విచారణ కొనసాగించే హక్కు ఉంది. కానీ, తన అంగీకారం లేకుండా భర్త తనపై లైంగిక చర్యలకు పాల్పడినందుకు అతనిపై ప్రాసిక్యూషన్‌ ప్రారంభించే హక్కు మాత్రం భార్యలకు లేదు. రుతుక్రమం, పలు కారణాలతో భర్తతో సంభోగానికి దూరంగా ఉండాలని భార్య భావించి ఉండవచ్చు. పలు సందర్భాల్లో భర్తకు హెచ్‌ఐవీ తదితర లైంగిక వ్యాధులు ఉన్నాయని తెలిసిన సమయంలో సంభోగానికి నిరాకరించేందుకు కూడా అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో భర్త చేసే గాయం తక్కువ హానికరమో, తక్కువ అమానవీయమో అవ్వదు. వైవాహిక అత్యాచారం కూడా శారీరక గాయాలతో పాటు మానసికంగా లోతైన గాయాలు చేస్తుంది’’ అని జడ్జి ఈ విచారణ సందర్భంగా పేర్కొన్నారు.

- Advertisement -

అయితే.. దీనిపై జస్టిస్‌ హరిశంకర్‌ మాత్రం భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు. మహిళల లైంగిక స్వేచ్ఛ రాజీపడే అంశం కాదని, నైతికంగా, చట్టపరంగా, ఆధ్యాత్మికంగా, ఇతర అన్ని విషయాల్లోనూ పురుషులతో సమానమేనని పేర్కొన్నారు. భార్యతో సంభోగం విషయంలో చట్ట నిబంధనలు భర్తకు కల్పిస్తున్న మినహాయింపు రాజ్యాంగ విరుద్ధం కాదని, దాంతో ప్రాథమిక హక్కులకు విఘాతం కలగడం లేదని జస్టిస్‌ హరిశంకర్‌ పేర్కొన్నారు.

2017లోనే కేంద్రం అఫిడవిట్‌..

వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించే విషయమై.. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, సంబంధీకులు అందరితోనూ అర్థవంతమైన, నిర్మాణాత్మక సంప్రదింపులు చేపట్టాల్సి ఉందని కేంద్ర ప్రభుత్వం ఇంతకు ముందే ఢిల్లీ హైకోర్టుకు నివేదించింది. సామాజిక, చట్టపరమైన చిక్కులతో ముడిపడిన ఈ అంశంపై.. సంప్రదింపుల తర్వాతే ప్రభుత్వం ఏదైనా సాయం చేయగలదని చెప్పింది. ఆయా పిటిషన్లపై విచారణను వాయిదా వేయాలని కోరగా.. ఇందుకు కోర్టుకు నిరాకరించింది. 2017లో ఈ కేసు విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలుచేసింది. వైవాహిక అత్యాచారం నేరం కాదన్న అభిప్రాయం వ్యక్తం చేసింది. దీన్ని నేరంగా పరిగణిస్తే భర్తలను వేధించేందుకు ఇది సులభమైన సాధనంగా మారి, వివాహ వ్యవస్థ అస్థిరతకు గురయ్యే ప్రమాదముందని కేంద్రం తన అఫిడవిట్‌లో తెలిపింది.

కేసు పూర్వాపరాలు ఏంటంటే..

భారత శిక్షాస్మృతిలోని 375వ నిబంధన (అత్యాచారం) నుంచి వైవాహిక అత్యాచారాన్ని మినహాయించడంతో, దాన్ని రాజ్యాంగ బద్ధతను సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. సెక్షన్‌ 375లోని మినహాయింపు ప్రకారం.. భార్య మైనర్‌ కానప్పుడు, ఆమెతో భర్త సంభోగంలో పాల్గొనడాన్ని అత్యాచారంగా పరిగణించరు. అయితే, దీన్ని సవాల్‌ చేస్తూ అఖిల భారత ప్రజాస్వామ్య మహిళా సంఘంతో పాటు ఆర్‌ఐటీ ఫౌండేషన్‌ ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశాయి.

భార్య అనుమతి లేకుండా ఆమెతో భర్త జరిపే లైంగిక చర్యలు అత్యాచారంతో సమానమని, వైవాహిక అత్యాచారాన్ని సైతం నేరగంగా పరిగణించి, దోషులను శిక్షించాలని కోరగా.. జస్టిస్‌ రాజీవ్‌ శక్ధర్‌, జస్టిస్‌ హరిశంకర్‌ ధర్మాసనం విచారణ జరిపింది. దంపతుల మధ్య లైంగిక సంపర్కాన్ని వివాహేతర దంపతుల మధ్య లైంగిక సంపర్కాన్ని వివాహేతర సంబంధంతో సమానంగా పరిగణించకూడదని మెన్‌ వెల్ఫేర్‌ ట్రస్ట్‌ వాదనలు వినిపించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement