Monday, April 29, 2024

Terror Attack | జాతీయ అత్యవసర పరిస్ధితి ప్రకటించిన ఇజ్రాయెల్.. మిలిటెంట్లతో అమీతుమీకి రెడీ!

ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. హమాస్ మిలిటెంట్లు రాకెట్లతో ఇజ్రాయెల్‌పై విరుచుకుపడటంతో.. ఇజ్రాయెల్ ప్రతిదాడులకు దిగుతోంది. దీంతో జనం ఇళ్లలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. హమాస్ మిలిటెంట్ల ఆకస్మిక దాడి నేపథ్యంలో ఇజ్రాయెల్ జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. దుండగులు కనీసం 22మంది ఇజ్రాయిలీలను చంపగా, 500 మందికి పైగా గాయపడ్డ‌ట్టు వార్త‌లు అందుతున్నాయి. ఉగ్రవాదులు కొంతమంది పౌరులను బందీలుగా ఉంచుకున్న‌ట్టు తెలుస్తోంది.

– వెబ్​ డెస్క్​, ఆంధ్రప్రభ

ఈ సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో ఇజ్రాయెల్ అధికారులు తక్షణ చర్యలు తీసుకుంటున్నారు. గాజా స్ట్రిప్‌లోని లక్ష్యాలను ఇజ్రాయెల్ ఛేదిస్తోంది. రాకెట్ నిరోధక రక్షణ వ్యవస్థను మోహరించడంతో పేలుళ్ల శబ్ధాలు వినిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ ఇటీవలి కాలంలో ఎదుర్కొన్న ఘోరమైన దాడిగా దీనిని అధికారులు అభివర్ణించారు. ఇప్పటికే యుద్దానికి సిద్దమని ప్రకటించిన ఇజ్రాయెల్ సైన్యం.. హమాస్ మిలిటెంట్లపై ‘‘ఆపరేషన్ ఐరన్ స్వోర్డ్స్’’ను ప్రకటించింది. గాజా స్ట్రిప్‌లోని పాలస్తీనా తీవ్రవాద సంస్థ హమాస్‌ను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ వైమానిక దళం డజన్ల కొద్దీ ఫైటర్ జెట్‌లతో దాడి చేసింది. మరోవైపు హమాస్‌ మిలిటెంట్లకు ఇజ్రాయెల్ భారీ హెచ్చరికను జారీ చేసింది. టెల్ అవీవ్‌లోని ఇజ్రాయెల్ మిలిటరీ ప్రధాన కార్యాలయంలో భద్రతా మంత్రివర్గ సమావేశం తర్వాత.. ఆ దేశ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ మాట్లాడుతూ దాడిని ప్రారంభించడం ద్వారా హమాస్ తీవ్ర తప్పు చేసిందని అన్నారు. పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ యుద్ధాన్ని ప్రారంభించిందని.. ఇజ్రాయెల్ గెలుస్తుందని ధీమాగా చెప్పారు.

ప్రస్తుత పరిణామాలపై స్పందించిన ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు.. తాము యుద్దంలో ఉన్నామని ప్రకటించారు. ‘‘ఇజ్రాయెల్ పౌరులారా.. మనం యుద్ధంలో ఉన్నాము. శత్రువు భారీ మూల్యాన్ని చెల్లించవలసి ఉంటుంది. మనం ఈ యుద్ధంలో గెలుస్తాము’’ అని ప్రధాని నెతన్యాహు చెప్పారు. శత్రువు ఇంతకు ముందెన్నడూ తెలియని ప్రతిస్పందనను ఎదుర్కొంటారని అన్నారు. ఇక, ఈరోజు ఉదయం గాజా స్ట్రిప్ ప్రాంతం నుంచి హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై రాకెట్ల వర్షం కురిపించారు. కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే వేలాది రాకెట్లు ప్రయోగించారు. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ సైన్యం.. దేశం దక్షిణ, మధ్య ప్రాంతాలలో ఒక గంటకు పైగా సైరన్లతో జనాలకు హెచ్చరికలు జారీచేసింది. బాంబు షెల్టర్ల దగ్గర ఉండమని ప్రజలను కోరింది.

మిలిటెంట్ల చొరబాటుకు సంబంధించి ఇజ్రాయెల్ సైన్యం ఒక ప్రకటన విడుదల చేసింది. గాజా వైపు నుంచి ఉగ్రవాదులు చొరబడ్డారని సైన్యం తెలిపింది. ఈ ప్రాంత ప్రజలు తమ ఇళ్లలోనే ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నామని సైన్యం పేర్కొంది. అయితే ఈ రాకెట్ల దాడుల వల్ల ఏ మేరకు నష్టం జరిగిందనేది తెలియాల్సి ఉంది. ఈ రాకెట్ల దాడుల్లో ఒక మహిళ మృతిచెందిందని వార్తలు వెలువడుతున్నాయి. ఇదిలాఉంటే, అయితే.. గాజా స్ట్రిప్‌లో 2007 నుంచి హమాస్ మిలిటెంట్ గ్రూప్ అధికారం చేపట్టింది. దీంతో గాజాపై ఇజ్రాయెల్ దిగ్బంధనాన్ని విధించింది. అప్పటి నుండి పాలస్తీనా మిలిటెంట్లు, ఇజ్రాయెల్ అనేక విధ్వంసకర యుద్ధాలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement