అఫ్గానిస్థాన్ లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలించే భారత ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో ఆ దేశంలో ఉన్న భారత రాయబార కార్యాలయాన్ని మూసివేసి.. 120 మంది అధికారులను భారత్ కు తరలించారు. కాబూల్ నుంచి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చెందిన సీ -17 యుద్ధ విమానం గుజరాత్లోని… జామ్నగర్లో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. విమానంలో మొత్తం 120 మంది భారతీయ అధికారులను తీసుకొచ్చారు. వారిలో చాలా మంది అక్కడి భారత రాయబార కార్యాలయంలో పని చేసేవారు ఉన్నారు. సోమవారం సాయంత్రమే వారంతా కాబూల్ ఎయిర్పోర్టుకి చేరుకున్నారు. అమెరికా భద్రత సహకారంతో అఫ్గనిస్తాన్ లో భారత రాయబారి, ఇతర ఉద్యోగులు ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. మంగళవారం ఉదయం విమానం బయలుదేరే వరకు వారికి భద్రత కల్పించారు. అక్కడి నుంచి వారు సేఫ్ గా భారత్ తీసుకొచ్చారు. కాబూల్ లోని ఎంబసీ ఉద్యోగులంతా సేఫ్ గా దేశానికి రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
మరోవైపు అఫ్గాన్.. తాలిబన్ల కబంధ హస్తాల్లోకి వెళ్లిపోయిన నేపథ్యంలో కొత్త కేటగిరీ వీసాలను కేంద్ర హోంశాఖ ప్రకటించింది. భారత్కు రావాలనుకునే అఫ్గానీల దరఖాస్తులను వేగంగా పరిశీలించేందుకు ఎలక్ట్రానిక్ వీసా విధానాన్ని తీసుకొచ్చింది. ‘ఇ-ఎమర్జెన్సీ ఎక్స్-మిస్క్ వీసా’ పేరుతో దీన్ని ప్రకటించింది. అఫ్గాన్లో ఆందోళనకర పరిస్థితులను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది.
భారత విదేశాంగ శాఖ ప్రత్యేక అఫ్గానిస్థాన్ సెల్ ఏర్పాటు చేసింది. దీని ద్వారా అఫ్గాన్ లో ఉన్నవారు భారత్ వచ్చేందుకు అన్ని రకాల సహాయం పొందే అవకాశం ఉంది. విదేశాంగ శాఖ ఓ మొబైల్ నంబర్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. +919717785379 నెంబర్ తోపాటు [email protected] మెయిల్ ఐడీ కూడా ఇచ్చింది. అఫ్గాన్ నుంచి సాయం కోరేవారు ఈ నంబర్ లేదా మెయిల్ ఐడీ ద్వారా అధికారులను సంప్రదించాలని కాబూల్లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది.
అఫ్గానిస్తాన్ ను తాలిబాన్లు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కాబూల్ లో వందలాది మంది తాలిబాన్లు సాయుధులైన పహారా కాస్తున్నారు. బయట పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అక్కడే ఉంటే ప్రాణాలు ఉంటాయో.. పోతాయో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. మూర్ఖులైన తాలిబాన్లు ఎంబసీలోకి చొరబడితే అధికారుల ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. కాబూల్ ఎయిర్ పోర్టులో వందలాది మంది అఫ్గాన్లు విమానాలు ఎక్కేందుకు ఎదురుచూస్తున్నారు. రన్ వే పై జనాలుండగా.. ఫ్లైట్ ల్యాండింగ్, టేకాఫ్ అవడం కష్టం.
ఇది కూడా చదవండి: హైదరాబాద్ లో ట్రిపుల్ తలాక్ కేసులు..