Sunday, May 5, 2024

Hyderabad Political Scenario – హైదరా’బాద్ షాలెవరు’…

వచ్చే అసెంబ్లి ఎన్నికల్లో రాష్ట్ర రాజధానిపై పూర్తి స్థాయిలో పట్టు సాధించేందుకు అధికారపార్టీ భారత రాష్ట్ర సమితి (భారాస) ప్రత్యేక వ్యూహం రచిస్తుండగా పూర్వ వైభవం కోసం కాంగ్రెస్‌, బీజేపీ ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. 2018లో జరిగిన అసెంబ్లి ఎన్నికల్లో భారాస మెజార్టీ స్థానాల్లో విజయం సాధించినప్పటికీ ఆ తర్వాత కొన్ని నెలలకే జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానంలో పరాజయం పాలైంది. అనంతరం జరిగిన జీహచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ ఆశించిన ఫలితాలు దక్కక పోగా.. బీజేపీ అనూహ్యమైన ఫలితాలను నమోదు చేసింది. ఈ క్రమంలోనే పట్టభద్రుల ఎన్నికల్లో బీజేపీ సిట్టింగ్‌ స్థానాన్ని.. భారాస తమ ఖాతాలో వేసుకున్నప్పటికీ కొన్ని నెలల క్రితం జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సత్తా చాటింది. ఇలా పలు సందర్భాల్లో భాగ్యనగరంలో కమలం పార్టీ ఎన్నికల్లో ప్రభావం చూపుతున్న నేపథ్యంలో త్వరలో జరిగే అసెంబ్లి ఎన్నికల్లో పటిష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని అధికార పార్టీ వ్యూహం రచించే పనిలో నిమగమై ఉంది.

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో:

భాగ్యనగరంలో కమలం పార్టీ ఎన్నికల్లో ప్రభావం చూపుతున్న నేపథ్యంలో త్వరలో జరిగే అసెంబ్లి ఎన్నికల్లో పటిష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని అధికార పార్టీ వ్యూహం రచించే పనిలో నిమగమై ఉంది. ఇక హైదరాబాద్‌లో ఏడు అసెంబ్లి సీట్లలో పాగా వేసిన ఎంఐఎం ఈ అసెంబ్లి ఎన్నికల్లో హైదరాబాద్‌ లోక్‌సభ పరిధిలోని నియోజకవర్గాలతో తమ సామాజిక వర్గం ఓటర్లు బలంగా ఉన్న సికింద్రాబాద్‌, ఖైరతాబాద్‌, జూబ్లి హల్స్‌, మల్కాజిగిరి, పటాన్‌చెరు, రాజేంద్రనగర్‌, కుత్బుల్లాపూర్‌, మేడ్చల్‌, శేరిలింగంపల్లి, ఉప్పల్‌ వంటి నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టి ఇప్పుడున్న అసెంబ్లి సీట్లకు తోడుగా సంఖ్యా బలాన్ని పెంచుకోవాలని నిర్ణయించింది. వచ్చే ఎన్నికల్లో 45 అసెంబ్లి స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ఈ దిశగా కార్యాచరణ ప్రారంభించినట్టు సమాచారం. గత ఎన్నికల్లో కేవలం గోషామహల్‌ స్థానానికే పరిమితమైన భాజపా హదరాబాద్‌లో ఈ ఎన్నికల్లో కనీసం ఆరేడు స్థానాల్లోనైనా పాగావేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. జీహచ్‌ఎంసీ ఎన్నికల్లో 48 కార్పొరేటర్లను గెలిచి సత్తా చాటిన విధంగానే అసెంబ్లి ఎన్నికల్లోనూ ఇదే వ్యూహాన్ని అమలు చేయాలనీ భావిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో హదరాబాద్‌లోని ఖైరతాబాద్‌, జూబ్లిహల్స్‌, సికింద్రాబాద్‌, శేర్లింగంపల్లి, కుత్బుల్లాపూర్‌, ఉప్పల్‌, ఎల్బీనగర్‌, మల్కాజ్‌ గిరి, అంబర్‌పేట్‌ వంటి నియోజకవర్గాల్లో గెలిచిన తరహాలోనే ఈ ఎన్నికల్లోనూ పట్టుసాధించాలన్న పట్టుదలతో కాంగ్రెస్‌ ఉంది.

జీహచ్‌ఎంసీపై ప్రత్యేక దృష్టి సారించిన కేటీఆర్‌
అసెంబ్లిd ఎన్నికల్లో గ్రేటర్‌ #హదరాబాద్‌పై గులాబీ జెండా ఎగురవేసేందుకు మునిసిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించారు. ఎంఐఎం స్థానాలు మినహా మిగతా అన్ని చోట్ల విజయకేతనం ఎగురవేయాలన్న లక్ష్యంతో అయన వ్యూహాలు రచిస్తున్నారు. మరోవైపు కొంతమంది సిట్టింగ్‌లపై వేటు తప్పదన్న సంకేతాలను ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల్లో మార్పులు ఎలా ఉండబోతున్నాయన్న చర్చ పార్టీలో విస్తృతంగా సాగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తరచూ జరిపిస్తున్న సర్వేలలో వచ్చిన ఫలితాల ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని తనను కలిసిన సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు కేసీఆర్‌ చెబుతున్నట్టు తెలుస్తోంది. మళ్ళీ తమకు టికెట్‌ ఖాయమని భారాస శాసనసభ్యులందరూ పూర్తి విశ్వాసాన్ని ప్రదర్శిస్తుండగా తమకు ఒక్క అవకాశం ఇవ్వాలంటూ ఇతర ఆశా వహులు తమదైన శైలిలో ప్రయత్నాలను ముమ్మరం చేకుంటున్నారు.

భారాస బహుముఖ వ్యూహం
ఒకవైపు అభివృద్ధి, సంక్షేమం అస్త్రాలుగా ఎన్నికల్లో ముందుకెళ్తూనే.. మరోవైపు రాజకీయ వ్యూహాలతో ప్రత్యర్థులను చిత్తు చేసేలా భారాస బహుముఖ వ్యూహాలు సిద్ధం చేస్తోందన్న ప్రచారం జరుగుతోంది. మహానగరం #హదరాబాద్‌లో ప్రస్తుతం ఏడు స్థానాల్లో ఎంఐఎం శాసనసభ్యులు ఉన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగిన అన్ని సర్వేలు.. ఆ ఏడు స్థానాలు మాత్రం మళ్లి మజ్లిస్‌ పార్టీవేనని చెబుతున్నాయి. ఆ నియోజక వర్గాల్లో ప్రాంతాల్లో బీఆర్‌ఎస్‌ పోటీ నామమాత్రమే ఉండబోతోంది. హదరాబాద్‌ పాత బస్తీలో కనీసం ఒక చోటైనా గెలిచి సత్తా చాటాలన్న ప్రయత్నంలో భాజపా ఉన్నట్టు సమాచారం.

మహేశ్వరంలో …..
2018 అసెంబ్లిd ఎన్నికల్లో మహశ్వరంలో సబితా ఇంద్రారెడ్డి, ఎల్బీనగర్‌ నుంచి సుధీర్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ గుర్తుపై గెలిచాక మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మిగిలిన 10 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో పాటు వీరిద్దరూ భారాస గూటికి చేరారు. గోషామహల్‌లో బీజేపీ తరపున రాజాసింగ్‌ విజయం సాధించారు. అయితే జీహచ్‌ఎంసీ ఎన్నికల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలున్న పలు నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌కు గట్టి దెబ్బలు తగిలాయి.

- Advertisement -

జీ హెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఘోర పరాభవం
భారాస ఎమ్మెల్యే ఉన్న ఎల్బీనగర్‌ నియోజకవర్గంలోని అన్ని వార్డుల్లో బీజేపీ విజయఢంకా మోగించింది ముషీరాబాద్‌లోనూ ఒక్క సీటూ గెలవలేక పోయింది. ఇక్కడ కూడా భారాస ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ ఉన్నారు. అంబర్‌పేటలో రెండు వార్డుల్లోనే గెలవగలిగింది. హబ్సిగూడ వార్డులో ఉప్పల్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి భార్య ఓడిపోయారు. అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడు లేవని.. తాజా సర్వేలన్నీ తమకు అనుకూలంగానే ఉన్నాయంటున్న భారాస నేతలంటున్నారు. గ్రేటర్‌ హదరాబాద్‌లో సిట్టింగ్‌ స్థానాల్లో మళ్లి పాగా వేస్తామన్న ధీమాతో అధికార పార్టీ ఉంది. అసెంబ్లి ఎన్నికల్లో గోషామహల్‌, అంబర్‌పేట్‌, ముషీరాబాద్‌, ఉప్పల్‌ తదితర స్థానాల్లో గట్టి పోటీ ఉండవచ్చని అంతర్గత సర్వేల్లో బయట పడినట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కాగా గ్రేటర్‌లో పట్టుకోసం భారాస అధిష్ఠానం పకడ్బందీ ఎత్తులు వేస్తుండగా.. మరోవైపు టికెట్ల కోసం నేతల పోటీ తీవ్రమవుతోంది. నాయకుల మధ్య పోటీ ఒకదశలో శృతి మించి హకమాండ్‌ జోక్యం చేసుకొనే వరకు వెళ్తోంది. ఆషాడం తర్వాత తొలి జాబితా ప్రకటించేందుకు గులాబీ దళపతి కేసీఆర్‌ సిద్ధం అవుతున్నారన్న సంకేతాలు రావడంతో ఆశావహులు యువనేత కేటీఆర్‌ను ప్రసన్నం చేసుకునేందుకు అష్ట కష్టాలు పడుతున్నారు. టికెట్ల కోసం ఇక చావో రేవో అనే రీతిలో ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కొందరు సిట్టింగ్‌లను మారుస్తారన్న ప్రచారంతో.. గ్రేటర్‌ ఎవరి సీటు ఖాళీ అవుతుందోనన్న చర్చ జోరుగా సాగుతోంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు మాత్రం తమకు టికెట్‌ పక్కా అన్న పూర్తి ధీమాతోనే ఉన్నారు.

బీఆర్‌ఎస్‌ నేతల మధ్య విబేధాలు
టికెట్ల కోసం పోటీ పడే క్రమంలో భారాస నేతల నడుమ విభేదాలు పొడ సూపుతున్నట్టు సమాచారం. మేడ్చల్‌ నియోజకవర్గంలో తనకు తిరుగే లేదన్న ధీమాతో మంత్రి మల్లారెడ్డి ఉండగా ఆయనకు పొగ పెట్టేందుకు మేడ్చల్‌ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి సిద్ధమైనట్టు సమాచారం. ఈ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది ఇద్దరూ ఒక వేదికపైన బహరంగంగానే వాదులాటకు దిగిన సందర్భాలు కోకొల్లలు కుత్బుల్లాపూర్‌లో ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు కొంతకాలంగా.. నువ్వా నేనా అనేలా కార్యక్రమాలు నిర్వహస్తున్నారు. కేసీఆర్‌, కేటీఆర్‌లతో ఇద్దరు నేతలకు సాన్ని#హత్యం ఉండటంతో ఎవరితో వెళ్లాలనే సందిగ్ధతతో నియోజకవర్గంలోని పార్టీ క్యాడర్‌ సతమతమవుతున్నారు ఉప్పల్‌లో ఎమ్మెల్యే భేతి సుభాశ్‌రెడ్డి, జీహచ్‌ఎంసీ మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ మధ్య ఇదే పరిస్థితి నెలకొంది. ప్లెnక్సీల ఏర్పాటు నుంచి ప్రతి విషయంలోనూ ఇద్దరి మధ్య పోటీ.. కొన్ని సార్లు శృతి మించుతోంది. అంబర్‌ పేటలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌ పార్టీ నేత ఎడ్ల సుధాకర్‌ రెడ్డి, ముషీరాబాద్‌లో ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ శ్రీనివాస్‌ రెడ్డిల నడుమ వైరం ముదురుతోంది. సనత్‌నగర్‌ ఎమ్మెల్యేగా ఉండి పశు సంవర్ధక శాఖ మంత్రిగా పని చేస్తున్న తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఈ ఎన్నికల్లో ముషీరాబాద్‌ నుంచి బరిలోకి దిగాలన్న ప్రయత్నంలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఒక వేళ ఈ ప్రతిపాదనకు పార్టీ పెద్దలు అంగీకరించకపోతే తనకు అత్యంత సన్నిహతుడైన ఎంఎన్‌ శ్రీనివాస్‌కు ముషీరాబాద్‌ టికెట్‌ ఇప్పించాలన్న పట్టుదలతో ఉన్నట్టు సమాచారం.

అంబర్‌పేట నుంచి భాజపా నూతన అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మళ్ళీ పోటీ చేస్తారని తెలుస్తోంది. ముషీరాబాద్‌ నుంచి హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ కుమార్తె పోటీకి దిగనున్నారు. ఖైరతాబాద్‌ భారాస బరిలో విద్యావేత్త గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌ పోటీ పడుతున్నట్టు సమాచారం. ఎల్బీనగర్‌లో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి గతంలో పోటీ చేసిన రామ్మోహన్‌ గౌడ్‌ వర్గాల మధ్య కొన్ని సందర్భాల్లో ఘర్షణ వాతావరణమే నెలకొంది. మహశ్వరంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డికి బదులుగా తనకు టికెట్‌ ఇవ్వకపోతే పార్టీతో తాడో పేడో తేల్చుకుంటానంటూ మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి బహరంగంగానే ఆల్టిమేట్టం ఇస్తున్నారు. అంబర్‌పేటలో గత ఎన్నికల్లో బీజేపీ నేత కిషన్‌రెడ్డిపై గెలిచిన న్యాయవాది.. కాలేరు వెంకటేశ్‌ మళ్లి టికెట్‌ తనదే అంటున్నారు. అయితే అంబర్‌పేట నుంచి 2014లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన ఎడ్ల సుధాకర్‌రెడ్డి మళ్లి పూర్తిస్థాయిలో రంగంలోకి దిగారు. పోటాపోటీ కార్యక్రమాలు చేస్తున్న ఎడ్ల సుధాకర్‌రెడ్డి.. ఈ సారి బీజేపీని ధీటుగా ఎదుర్కొనే సత్తా తనకే ఉందని అధిష్ఠానానికి వివరించడంతో పాటు.. స్థానికంగా కార్పొరేటర్లను తనవైపునకు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారు.

రాజేంద్రనగర్‌లో ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌కు పోటీగా.. మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్‌రెడ్డి, చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ శాసనసభ్యుడు సాయన్న అకాల మరణంతో అక్కడ తనకు అవకాశం ఇవ్వాలని ఆయన కుమార్తె, మాజీ కార్పొరేటర్‌ లాస్య నందిత కోరుతున్నారు. మరోవైపు రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్‌ క్రిశాంక్‌, బేవరేజెస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ గజ్జెల నగేశ్‌ పార్టీ పెద్దలతో ఉన్న సాన్నిహత్యంతో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
కూకట్‌పల్లిలో మాధవరం కృష్ణారావుతో పాటు.. బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత గొట్టిముక్కల వెంకటేశ్వరరావు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కాలనీల్లో పర్యటిస్తూ, అవసరమైన వారికి సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా సాయం చేస్తూ ప్రజల్లో చొచ్చుకెళ్లడంతో పాటు ఉద్యమకాలం నుంచి తన కుటుంబం చేసిన కార్యక్రమాలను వివరిస్తూ అధిష్ఠానం మెప్పుపొందేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
ఇబ్రహంపట్నంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డితో పాటు.. కాంగ్రెస్‌ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరిన క్యామ మల్లేశ్‌ కూడా ఆశిస్తున్నారు. శేరిలింగంపల్లిలో అరికెపూడి గాంధీ హ్యాట్రిక్‌పై ధీమాతో ఉండగా.. ఈసారి తనకు అవకాశం ఇవ్వాలని బండి రమేశ్‌ కోరుతున్నారు. ఖైరతాబాద్‌లో దానం నాగేందర్‌ తనకే మళ్లి టికెట్‌ అంటుండగా.. ఉద్యమకాలం నుంచి పార్టీని నమ్ముకున్న తనకు ఎందుకు ఇవ్వరని సీనియర్‌ నేత మన్నె గోవర్ధన్‌రెడ్డి వంటి నేతలు అడుగుతున్నారు. ముషీరాబాద్‌ మళ్లి తనదేనని ముఠా గోపాల్‌ అంటుండగా.. దివంగత మంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్‌రెడ్డి, టీడీపీ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్‌ఎన్‌ శ్రీనివాస్‌ తదితరులు ఆశిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement