Sunday, April 28, 2024

హుజూరాబాద్ ఉప ఎన్నిక..కేసీఆర్ కి ఇదే మొద‌టి ఓట‌మి..

తెలంగాణ అంటే కేసీఆర్…కేసీఆర్ అంటే తెలంగాణ అనేంత‌లా పేరుని సంపాదించుకున్నారాయ‌న‌. అయితే హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల్లో వ‌చ్చిన తీర్పు చూస్తే అవాక్క‌వ్వాల్సిందే. కేసీఆర్ పై వ్య‌తిరేక‌త ఉంద‌ని ప‌లు స‌ర్వేలు ఇప్ప‌టికే తెలిపాయి. అది నిజ‌మేన‌ని నిరూపించారు హుజురాబాద్ ప్ర‌జ‌లు. స్థానికుడ‌యిన బిజెపి అభ్య‌ర్థిగా ఎన్నిక‌ల బ‌రిలోకి దిగిన ఈట‌ల రాజేంద‌ర్ ని గెలిపించ‌డం విశేషం. కాగా తెలంగాణ వచ్చిన తర్వాత అధికారం చేపట్టిన టీఆర్ఎస్ పార్టీ.. ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ పార్టీగా రూపాంతరం చెందింది. కేసీఆర్ రాజకీయ చతురత ముందు ప్రతిపక్షాలు తేలిపోయాయి. ముఖ్యంగా కాంగ్రెస్ ఇంత దీనావస్థకు చేరుకుందంటే అది కేసీఆర్ చతురతే..అంతటి కేసీఆర్ ముందు జానారెడ్డి వంటి రాజకీయ ఉద్దండులే ఎన్నికల్లో ఓడిపోయారు. ఇప్పటి వరకు కేసీఆర్ ని ఎదురించి టీఆర్ఎస్ పార్టీ నుంచి వేరే పార్టీలో చేరి గెలిచిన వారు లేరనే చెప్పాలి.

తాజాగా ఆ రికార్డును తిరగరాస్తూ టీఆర్ఎస్ పార్టీని ధిక్కిరించి ఈటెల రాజేందర్ గెలుపొందండం విశేష‌మ‌నే చెప్పాలి. గతంలో టికెట్ రాని సమయంలో బాబూమోహన్, బొడిగె శోభ వంటి వారు టీఆర్ఎస్ నుంచి.. బీజేపీ నుంచి పోటీ చేసి 2018 ఎన్నికల్లో ఓడిపోయారు. అదే సమయంలో వరంగల్ జిల్లాలో గట్టిపట్టు ఉన్నకొండా దంపతులు కూడా 2018 ఎన్నికల్లో దారుణంగా ఓటమి చవిచూశారు. ఎన్నికల ముందు టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారిన కొండా సురేఖ పరకాల నియోజకవర్గంలో దారుణ ఓటమి చవిచూశారు. టీఆర్ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఇదే విధంగా ఆందోల్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి చంటి క్రాంతికిరణ్ చేతుల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన బాబూ మోహన్ ఓడిపోయారు.

ఇక చొప్పదండి నియోజకవర్గంలో 2018లో బీజేపీ నుంచి పోటీ చేసిన బొడిగే శోభ కూడా ఓడిపోయారు. గతంలో విజయశాంతికి కూడా ఈ రకం పరాభవమే ఎదురైంది. గత రికార్డులను బట్టి చూస్తే తెలంగాణ ఏర్పాటు అనంతరం నుంచి టీఆర్ఎస్ నుంచి వేరే పార్టీలోకి వెళ్లి గెలిచిన వారు లేరనే చెప్పాలి. కానీ హుజూరాబాద్ నియోజకవర్గంలో మాత్రం చరిత్రను తిరగరాస్తూ ఈటెల రాజేందర్ గెలుపొందారు. టీఆర్ఎస్ పార్టీ తనను అవమానకర రీతిలో బయటకు పంపే ప్రయత్నం చేయడంతో ఈటెల రాజేందర్ మంత్రి, ఎమ్మెల్యే పదవులతో పాటు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. గత ఆరు నెలలుగా హుజూరాబాద్ నియోజకవర్గంలోనే ఉంటూ ప్రచారం నిర్వహించారు. అయితే టీఆర్ఎస్ కూడా తన మంత్రులను, ఎమ్మెల్యేలను, అధికార యంత్రాంగాన్ని ఉపయోగించిన ఈటెల రాజేందర్ విజయాన్ని అడ్డుకోలేకపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement