Saturday, May 4, 2024

MP: పరువు హత్య.. ప్రేమికులను చంపి మొసళ్లకు ఆహారంగా వేసిన కుటుంబం

ప్రేమికులిద్దరినీ తుపాకీతో కాల్చి చంపి.. మొసళ్లకు ఆహారంగా పడేసిన ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్‌ లోని మొరేనా జిల్లాలో ఇటీవలే జరిగిన ఈ పరువుహత్య తాజాగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రతన్‌బసాయ్‌ గ్రామానికి చెందిన శివానీ తోమర్‌ (18), పక్కనున్న మరో ఊరికి చెందిన రాధేశ్యామ్‌ తోమర్‌ (21) గత కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం శివానీ ఇంట్లో తెలియడంతో కుటుంబీకులు ఆమెను హెచ్చరించారు. ఇకపై అతడిని కలవొద్దని హెచ్చరించారు. అయినప్పటికీ, ఆమె రాధేశ్యామ్‌తో తన బంధాన్ని కొనసాగించింది. దీంతో ఆగ్రహం చెందిన ఆమె కుటుంబీకులు ఊరి పొలిమేరలో సమీపంలో ఇద్దర్నీ తుపాకీతో కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు.

గత కొన్నిరోజులుగా తన కుమారుడితోపాటు, పొరుగు గ్రామానికి చెందిన యువతి కనిపించడం లేదంటూ రాధేశ్యామ్‌ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వారిద్దరూ హత్యకు గురై ఉండొచ్చని అనుమానించిన ఆయన.. వారిద్దరి మధ్య సంబంధాన్ని కూడా పోలీసులకు చెప్పాడు. అయితే, కుటుంబ సభ్యులు వ్యతిరేకించడంతో వారిద్దరూ ఎక్కడికో పారిపోయి ఉంటారని పోలీసులు తొలుత భావించారు. కానీ, వాళ్లిద్దరూ కలిసి వెళ్లినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదు. దీంతో యువతి తండ్రిని, అతడి కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించారు. కొన్ని గంటలపాటు వివిధ కోణాల్లో ప్రశ్నలు అడిగిన తర్వాత.. తామే హత్య చేసినట్లు వాళ్లు అంగీకరించారు. అంతేకాకుండా మృతదేహాలకు రాళ్లు కట్టి చంబల్‌ నదిలో పడేసినట్లు చెప్పారు. దీంతో మృతదేహాలను బయటకి తీసేందుకు గజ ఈతగాళ్ల సాయం తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement