Monday, April 29, 2024

25న గులాబీ జెండా సంబురం.. 27న బీఆర్ఎస్ స‌ర్వ‌స‌భ్య స‌మావేశం

ఈనెల 25వ‌తేదీన గులాబీ జెండా సంబురం చేసుకుంటున్నామ‌ని, అలాగే 27వ తేదీన బీఆర్ఎస్ స‌ర్వ‌స‌భ్య స‌మావేశం ఘ‌నంగా నిర్వ‌హిస్తున్నామ‌ని మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… బీఆర్‌ఎస్‌ ఆవిర్భావం సందర్భంగా ఈనెల 25న నియోజకవర్గ స్థాయి సమావేశాలను విజయవంతంగా నిర్వహించాలని మంత్రి కేటీఆర్‌ సూచించారు. ప్రతి గ్రామంలో, మున్సిపల్‌ వార్డులో ప్రతి డివిజన్‌లో పార్టీ జెండా ఎగురవేసి.. సమావేశం నిర్వహించే బాధ్యత నియోజకవర్గ ఇన్‌ఛార్జిలదేన‌ని మంత్రి కేటీఆర్‌ మరోసారి సూచించారు. ఇప్పటికే ఆత్మీయ సమ్మేళనాలు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నాయన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో బహిరంగ సభల స్థాయిలో జరుగుతున్నాయని, వాటిని కూడా మే నెలాఖరు వరకు పొడిగించామ‌న్నారు. పార్టీ అన్నిరకాలుగా ఎన్నికలతో పాటు అన్ని పోరాటాలకు సన్నద్దంగా ఉండాలని.. ఎప్పటికప్పుడు కార్యకర్తలతో సంభాషణ జరగాలని ఈ ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేశామ‌న్నారు. ఇవి చక్కగా జరుగుతున్నాయని, అక్కడక్కడ త‌మ దృష్టికి వచ్చిన చిన్న ఇబ్బందులను కరెక్ట్‌ చేసుకుని ముందుకెళ్తామ‌ని కేటీఆర్ తెలిపారు.

ఈ నెల 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని భారత రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయమైన తెలంగాణ భవన్‌లో పార్టీ అధ్యక్షులు కేసీఆర్ నాయకత్వంలో సర్వసభ్య సమావేశం జరుగుతుందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఈ సమావేశాల్లో భాగంగా పార్టీ పతాక ఆవిష్కరణ చేసి.. పలు అంశాలపై తీర్మానాలు, చర్చలు జరుపుతామని వెల్లడించారు. 22 సంవత్సరాల ప్రస్థానం పూర్తి చేసుకుని 23వ ఏట పార్టీ అడుగుపెడుతున్న సందర్భంగా అన్ని అంశాలపై సావధానంగా చర్చిస్తారని తెలిపారు. తెలంగాణలో జరగబోయే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల సన్నద్ధతపై కూడా చర్చించడం జరుగుతుందని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement