Saturday, May 4, 2024

తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలోనే గ్రూప్ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు

ఉద్యోగాల భర్తీకి సంబంధించి కొత్త జోన్ల విధానానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో నియామకాలకు అడ్డంకులు తొలగిపోయాయి. జోనల్ వ్యవస్థకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడంతో పాటు ఉద్యోగాలను స్థానికులచే 95 శాతం భర్తీ చేసే విధానం అమలులోకి రానుంది. తెలంగాణ ఏర్పడిన నాటినుంచి ఇప్పటి వరకు గ్రూప్- 4, గ్రూప్- 2 నోటిఫికేషన్లు మాత్రమే విడుదల అయ్యాయి. జోనల్ అంశంతో ముడిపడి ఉన్న కీలక ఉద్యోగాలకు సంబంధించిన నియామకాలు చేపట్టలేదు. దీంతో గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-3, ఇతర కేటగిరీల్లోని దాదాపు 3 వేలకుపైగా పోస్టుల భర్తీ ప్రక్రియకు మార్గం సుగమమైంది. కొత్త విధానం ప్రకారం ఏయే పోస్టులు ఏయే జోన్లలో వస్తాయి, ఏయే పోస్టులు మల్టీ జోన్‌ పరిధిలోకి వస్తాయన్న వివరాలు, సర్వీసు నిబంధనల మేరకు రోస్టర్, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌లను ఆయా ప్రభుత్వ శాఖలు ఖరారు చేయగానే నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉంది.

2018లో అప్పటికే ప్రభుత్వం ఏర్పాటు చేసిన 31 జిల్లాలతో కూడిన జోన్ల విధానానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. కానీ ప్రభుత్వం కొత్తగా ములుగు, నారాయణ్‌పేట్‌ జిల్లాలను ఏర్పాటు చేసింది. కొత్త జోన్ల విధానంలో ఈ జిల్లాలు లేకపోవడంతో పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టలేని పరిస్థితి నెలకొంది. ఒకవేళ నోటిఫికేషన్లు ఇచ్చినా.. న్యాయ వివాదాలు తప్పవని న్యాయ నిపుణులు హెచ్చరించారు. ఇదే తరుణంలో వికారాబాద్‌ జిల్లాను చార్మినార్‌ జోన్‌ పరిధిలోకి తేవాలని అక్కడి ప్రజలు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త అంశాలన్నీ చేరుస్తూ.. అప్పటికే 2018లో రాష్ట్రపతి ఆమోదం పొందిన ‘తెలంగాణ పబ్లిక్‌ ఎంప్లాయ్‌మెంట్‌ (ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ లోకల్‌ కేడర్‌ అండ్‌ రెగ్యులేషన్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌) ఆర్డర్‌–2018’కు సవరణలు చేసింది. ములుగు, నారాయణపేట కొత్త జిల్లాలను చేర్చడంతోపాటు, జోగులాంబ జోన్‌లో ఉన్న వికారాబాద్‌ జిల్లాను చార్మినార్‌జోన్‌కు మార్చి రాష్ట్రపతి ఆమోదం కోసం పంపింది. రాష్ట్రపతి దీనికి ఆమోద ముద్ర వేయడంతో కేంద్ర హోంశాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీంతో రాష్ట్రంలో పోస్టుల భర్తీకి లైన్‌ క్లియర్‌ అయింది.

ప్రభుత్వం సూచించిన మార్పులకు తాజాగా రాష్ట్రపతి ఆమోదం రావడంతో పోస్టుల భర్తీకి లైన్‌ క్లియర్‌ అయింది. అప్పట్లో గుర్తించిన సుమారు 3 వేల పోస్టులతో పాటు ప్రస్తుత ఖాళీలను కలుపుకొంటే 4వేలకు పైగా పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది. ఇవేకాకుండా ప్రభుత్వం భర్తీ చేయదలచిన 50 వేల ఉద్యోగాలకు కూడా కొత్త జోనల్‌ విధానాన్ని అమలు చేయనున్నారు. వీటికి సంబంధించిన నోటిఫికేషన్లు త్వరలో విడుదల కానున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement