Friday, April 26, 2024

నైట్ కర్ఫ్యూ ఎఫెక్ట్: ఏడు గంటల వరకే బస్ సర్వీస్!

తెలంగాణలో కరోనా వైరస్ కట్టడిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ విధించిన నేపథ్యంలో ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ లో ఇకపై రాత్రి ఏడు గంటలకే సిటీ బస్ సర్వీసుల చివరి ట్రిప్‌ను ముగించాలని నిర్ణయించింది. తెల్లవారుజామున నాలుగు గంటలకు మొదలయ్యే తొలి ట్రిప్‌లను ఆరు గంటలకు మార్చింది. రాత్రి 9 గంటలకల్లా ట్రిప్‌లు ముగించుకుని బస్సులు డిపోలకు చేరే ఉద్దేశంతో ట్రిప్‌లను కుదించింది.

అయితే, జిల్లా, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల విషయంలో ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. అవి యథాతథంగానే నడుస్తాయని అధికారులు తెలిపారు. ఒకవేళ తొమ్మిది గంటల సమయంలో ప్రయాణికులు బస్టాండ్లలో దిగితే కనుక ఇంటికి వెళ్లేందుకు ఆటోలు, క్యాబ్‌లు వినియోగించుకోవచ్చు. అయితే, ఇందుకు విధిగా టికెట్ చూపించాల్సి ఉంటుంది. మరోవైపు, రాత్రిపూట బయలుదేరే బస్సులు తగినంత మంది ప్రయాణికులు ఉంటేనే బయలుదేరుతాయని, లేదంటే రద్దవుతాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ విషయంలో ప్రయాణికులకు ముందే సమాచారం ఇస్తామని, రద్దయితే టికెట్ డబ్బులు వెనక్కి ఇస్తామని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement