Thursday, May 2, 2024

Red Alert: మ‌ళ్లీ ఉప్పొంగ‌నున్న గోదావ‌రి, ఉద్యోగులు అందుబాటులో ఉండాలే: సీఎం కేసీఆర్‌

ఇప్ప‌టికే కురుస్తున్న భారీ వ‌ర్షాల‌కు తోడు.. మ‌రోసారి భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిచే అవ‌కాశం ఉన్నందున అధికారులు అందుబాటులో ఉండాల‌ని, వారి హెడ్ క్వార్ట‌ర్లు విడిచి వెళ్లొద్ద‌ని సీఎం కేసీఆర్ సూచించారు. రెండు వారాలకు పైగా నిరంతరం కురుస్తున్న భారీ వానల వల్ల రాష్ట్రమంతా జలమయమైన నేపథ్యంలో ఇకనుంచి పడ్డ చుక్క పడ్డట్టే, వాగులు వంకలు దాటి, చెరువులు, కుంటలు పొంగి నదులకు చేరుకుంటుంద‌ని.. మరో రెండు రోజుల్లో భారీ వర్షాలున్నాయనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో భారీగా వరదలు సంభవించే ప్రమాదం ఉంద‌న్నారు. ఇవ్వాల భారీ వ‌ర్షాలు, గోదావ‌రి, కృష్ణా న‌దుల‌కు పోటెత్తుతున్న వ‌ర‌ద‌ల నేప‌థ్యంలో ఉన్న‌తాధికారుల‌తో సీఎం కేసీఆర్ స‌మీక్ష నిర్వ‌హించారు.

ఎటువంటి పరిస్థితులు తలెత్తినా ఎదుర్కునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని, అందుకు త‌గ్గ‌ట్టే అధికారులు కూడా స‌మాయత్తమై ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. అనవసర ప్రయాణాలు మాని, స్వీయ రక్షణ చర్యలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కూడా ముఖ్య‌మంత్రి కోరారు. గోదావరి నది తన జన్మస్థానమైన మహారాష్ట్రలోని త్రయంబకేశ్వరం నుంచి నదీ సంగమ బంగాళాఖాతం దాకా సందులేకుండా ఉదృతంగా ప్రవహిస్తున్నదని, గోదావరి ఉప నదుల్లో భారీ వరద పోటెత్తుతున్నదన్నారు. ప్రకృతి విపత్తు కష్టకాలంలో రాష్ట్ర ప్రజలను కాపాడుకునేందుకు ఇది రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి పరీక్షా కాలమని ముఖ్యమంత్రి అన్నారు. ఒక్క ప్రాణ నష్టం వాటిళ్ల‌కుండా.. ఇటీవలి వరదల సందర్భంగా ఉన్నట్టే అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టాలన్నారు. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని సీఎం స్పష్టం చేశారు.

ఉద్యోగులు హెడ్ క్వార్టర్లు విడిచి వెల్లకూడదు..
ఎమర్జెన్సీ సేవలందించే శాఖలతో పాటు, వానలు వరదల సందర్భంగా సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన అన్నిశాఖల అధికారులు వారి వారి ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న కేంద్రాలను వదిలి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లకూడదని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ మేరకు ఆదేశాలతో తక్షణమే సర్క్యులర్ జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్రంలో వరుసగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల పరిస్థితులపై .. ప్రగతి భవన్ లో సీఎం కేసిఆర్ అధ్యక్షతన శనివారం రాత్రి ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు టి.హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు పాల్గొన్నారు.

రేపటికే ఉదృతం కానున్న గోదావరి..
ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఇప్పుడు కురిసే వానలతో గోదావరి నది రేపు మధ్యాహ్నం నుంచే ఉధృతంగా మారే ప్రమాదముందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో గోదావరి పరీవాహక ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. అన్నిశాఖల సిబ్బంది, అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ మొన్నటి మాదిరిగానే వరద ముంపు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అప్రమత్తమై ఉండాలన్నారు. ఇప్పటికే తాను అన్ని జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి తగు సూచనలు ఇచ్చినట్లు సీఎం తెలిపారు. ఈ భారీ వానలు అగస్టు మొదటివారం దాకా కొనసాగే సూచనలున్నయన్నారు. ముంపునకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్న రామన్నగూడెం, ఏటూరునాగారం తదితర భధ్రాచలం పరిసర ప్రాంతాల్లో పకడ్బందీ చర్యలు చేపట్టాలని సిఎం అన్నారు.

రెండు హెలికాప్టర్లను సిద్దం చేయండి..
రాష్ట్ర రాజధానిలో అప్రమత్తంగా ఉండేలా హెలికాప్టర్ కు అధనంగా మరో రెండు హెలికాప్టర్లను రప్పించి , ములుగులో, కొత్తగూడెంలో సిద్దంగా ఉంచాలని సిఎస్ ను సిఎం ఆదేశించారు. ఖమ్మం కొత్తగూడెం లలో హెల్త్ క్యాంపులను ఏర్పాటు చేయాలన్నారు. ఎన్డీఆరెఫ్ సహా వరద సహాయక బృందాలను అందుబాటులో ఉంచాలని తక్షణ రక్షణ చర్యలకు సిద్దంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాను సిఎం ఆదేశించారు.

- Advertisement -

వచ్చిన వరదను వచ్చినట్టే వదలాలె :
ఎగువ గోదావరి నుంచి వచ్చిన వరదను వచ్చినట్టే ప్రాజెక్టుల గేట్లను ఎత్తి కిందికి విడుదల చేయాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ‘‘ఇన్ ఫ్లో ఎంత వస్తున్నదో అంతనీటిని అవుట్ ఫ్లో ద్వారా విడుదల చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో నీటిని ఆపకూడదు. ఈ మేరకు అన్ని ప్రాజెక్టు ఉన్నతాధికారులకు తక్షణ ఆదేశాలు జారీచేయండి..’’ అని రజత్ కుమార్ ను సిఎం ఆదేశించారు.

తాగునీరు కలుషితం కాకుండా :
మిషన్ భగీరథ తాగునీరు ఎక్కడా కలుషితం కాకుండా చూసుకోవాలని అందుకు తగు చర్యలు చేపట్టాలని కృపాకర్ రెడ్డిని సిఎం ఆదేశించారు. గేట్లు లేకుండా మత్తల్లు దునికి ప్రవహించే డిండి పాకాల, వైరా పాలేరు రిజర్వాయర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.

వరదల పరిస్థితిని ముందస్తు అంచనా కోసం సాప్ట్ వేర్:
భారీ వర్షాలకు నేపథ్యంలో వరదలను ముందస్తుగా అంచనావేసేందుకు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ ప్రత్యేకంగా రూపొందించిన ‘‘ ఫ్లడ్ ఫోర్ కాస్టింగ్ అండ్ మేనేజ్ మెంట్ సిస్టమ్ ’ అనే సాంకేతిక పరిజ్జానాన్ని ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ పరిశీలించారు. ఈమేరకు, కురిసే వానలకు అనుగుణంగా హెచ్చుతూ తగ్గుతూ హద్దులు దాటి ప్రవహిస్తున్న గోదావరి నదీ ప్రవాహాన్ని, గంట గంటకూ మారుతున్న వరద పరిస్థితిని శాటిలైట్ ఆధారంగా రికార్డు చేసి విశ్లేషించే విధానాన్ని ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్.. సీఎంకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ప్రదర్శించారు. ఈ సాంకేతిక పరిజ్జానాన్ని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ దేశంలోనే మొదటిసారి అభివృద్ధి చేస్తున్నదని రజత్ కుమార్ సిఎం కు వివరించారు. అందుకు సిఎం అభినందించారు.
వాతావరణ హెచ్చరికలను ఆధారం చేసుకొని, కురవబోయే భారీ వర్షాల వల్ల సంభవించే వరదను ముందుగానే అంచనా వేయగలుగుతున్నా వరద అంచనాను వేయలేకపోతున్న సమస్యలను ఈ సాప్ట్ వేర్ తొలగిస్తుందన్నారు. ముంపుప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ముందస్తు చర్యల కోసం ఈ టెక్నాలజీని వినియోగించుకోవచ్చని ఆయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement