Sunday, May 5, 2024

Maharashtra: ఘోర రోడ్డుప్ర‌మాదం.. నలుగురు దుర్మరణం

అక్కన్నపేట మే 24 (ప్రభన్యూస్) – మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో మంగళవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అన్నదమ్ములు మృతి చెందిన సంఘటన జరిగింది. ఎరుకల కృష్ణ, సంజీవ్, సురేష్, వాసుగా గుర్తించారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు జీవనోపాధి నిమిత్తం గత కొన్ని ఏళ్లుగా గుజరాత్ లోని సూరత్ లో ప్లంబింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇటీవల చౌటపల్లి లో తమ సమీప బంధువు మృతిచెందగా అంత్యక్రియలకు హాజరయ్యేందుకు కుటుంబ సభ్యులతో గ్రామానికి వచ్చారు. తిరిగి సూరత్ కు మంగళవారం కారులో అన్నదమ్ములు బయలుదేరారు. అదే రోజురాత్రి మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి పల్టీలు కొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురు అన్నదమ్ములు సంఘటన స్థలంలో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. బతుకుదెరువు కొరకు వెళ్లిన అన్నదమ్ములు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ సభ్యుల అరణ్య రోదనలతో గ్రామంలో విషాదం నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement