Sunday, May 5, 2024

Exclusive | చిలిపి ప‌నులు, పిచ్చి చేష్ట‌లు చేయ‌వ‌ద్దు.. పార్టీ లీడ‌ర్ల‌కు కేసీఆర్ హుకుం!

ఎన్నికల ముందు చిలిపి పనులు, పిచ్చి చేష్టలు చేయొద్ద‌ని బీఆర్ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్ పార్టీ లీడ‌ర్లు, అభ్యర్థులను హెచ్చరించారు. ప్రచారంలో నోరు అదుపులో పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ భవన్ లో పార్టీ అభ్యర్థులు, నియోజకవర్గ ఇన్‌చార్జిల‌తో ఆదివారం కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పార్టీ అభ్యర్థులకు ప‌లు అంశాల‌పై స‌ల‌హాలు, సూచ‌న‌లు చేస్తూనే ఒకింత హుకుం జారీ చేసిన‌ట్టు తెలుస్తోంది. కార్యకర్తలతో సామరస్యపూర్వకంగా మెదలాలని, తలబిరుసుతనంతో వ్యవహరిస్తే ఓటమి తప్పదని హెచ్చరించారు. గతంలో అహంకారం ప్రదర్శించడం వల్లే జూపల్లి ఓటమి పాలయ్యారని ఆయ‌న పేరు ఎత్త‌కుండా చెప్ప‌డం గ‌మ‌నార్హం.

ప్రజలు, కార్యకర్తలతో మాట్లాడేటపుడు నోరు అదుపులో పెట్టుకోవాలని సీఎం కేసీఆర్ చెప్పారు. అలకలు పక్కన పెట్టి అందరితో కలిసి పనిచేయాలని సూచించారు. ఈ ఎన్నికల ప్రచారానికి సోమ భరత్ కుమార్ ను సమన్వయకర్తగా నియమించినట్లు చెప్పారు. ఏదైనా సమస్య ఎదురైతే 98480 23175 నంబ‌ర్‌కు ఫోన్ చేయాలని.. భ‌ర‌త్ కుమార్ 24 గంట‌లు అందుబాటులో ఉంటారని అభ్యర్థులకు సూచించారు.

జూపల్లి కృష్ణారావు ఉదంతాన్ని కేసీఆర్ ప్రస్తావిస్తూ.. జూప‌ల్లి కృష్ణారావు అని ఒకాయ‌న ఉండే.. మంత్రిగా కూడా ప‌ని చేశారు. అయినా అహంకారంతో వ్యవహరించారు. ఇత‌ర నాయ‌కుల‌తో మాట్లాడ‌లేదు. దీంతో 2018 ఎన్నికల్లో ఓడిపోయారని కేసీఆర్ ఉద‌హ‌రించారు. ఒక మ‌నిషితో మాట్లాడేందుకు అహంకారం ఎందుకని కేసీఆర్ ప్రశ్నించారు. ప్రతి ఒక్కరికీ వ్యక్తిగ‌తంగా మనవి చేస్తున్నానంటూ.. ఈ ముఖ్యమైన సమయంలో మంచిగా మాట్లాడడం నేర్చుకోవాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement