Thursday, May 2, 2024

రేవంత్ ఆరోప‌ణ‌ల‌ను ఖండించిన డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదని తెలంగాణ‌ డీజీపీ మహేందర్ రెడ్డి ఆయ‌న వ్యాఖ్య‌ల‌ను ఖండించారు. తనను బలవంతంగా ప్రభుత్వం సెలవుపై పంపిచిందంటూ ఆయన ఆరోపణలు ఏమాత్రం నిజం కావన్నారు. తాను ఇంట్లో జారిపడిన ఘటనలో ఎడమ భుజానికి గాయమైంద‌ని, దీంతో పూర్తిస్థాయి విశ్రాంతి అవసరమని వైద్యుల సూచన మేరకు ఫిబ్రవరి 18 నుంచి మార్చి 4వ తేదీ వరకూ సెలవులో ఉండాల్సి వచ్చిందని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. వైద్యుల సలహా మేరకు తిరిగి విధుల్లో చేరతానని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతిరోజూ వ్యాయామం, ఫిజియోథెరిపీ చేస్తున్నానని చెప్పారు.వాస్తవాలు తెలుసుకోకుండా ప్రభుత్వం బలవంతంగా తనను సెలవుపై పంపించిందని చెప్పడం బాద్యతారాహిత్యమైన ఆరోపణలేనని మహేందర్ రెడ్డి అన్నారు. అవాస్తవాలు ప్రచారం చేయడం సరికాదన్నారు. రాజకీయ అవసరాల కోసం ప్రభుత్వ అధికారులపై అసత్య ప్రచారం చేయడం తగదని రేవంత్ రెడ్డికి డీజీపీ సూచించారు. ఉన్నతస్థాయిలో బాధ్యతాయుత హోదాలో ఉన్న సీనియర్ అధికారిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని హితవు పలికారు. ఇటువంటి ఆరోపణలు పోలీసు శాఖ ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీస్తాయని చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement