ప్రియుడి మోజులో పడి భర్తను హతమార్చిన ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగి. వివాహమైన 36 రోజులకే కట్టుకున్న భర్తను కడతేర్చింది. ప్రియుడితో కలిసి హత్య చేసి గుండెపోటు వచ్చిందంటూ నాటకమాడి పోలీసులకు అడ్డంగా బుక్క్ అయ్యింది.
హైదరాబాద్, ఆంధ్రప్రభ : పెద్దల బలవంతంతో ఇష్టంలేని పెళ్లి చేసుకున్న ఓ యువతి ప్రియుడి మోజులో పడి భర్తను కడతేర్చింది. ఒకసారి అన్నంలో విషం కలిపి హత్యాయత్నం చేసిన విఫలం కాగా రెండోసారి గొంతు నుమిలి చంపింది. చాతిలో నొప్పితో గుండె పోటు వచ్చి చనిపోయాడని నాటకమాడింది. పోలీసుల దర్యాప్తులో హత్య విషయం బయటకు రావడంతో జైలు పాలైంది. సిద్దిపేట జిల్లాలో ఏప్రిల్ 28న జరిగిన ఈ హత్య కేసు వివరాలను పోలీసులు వెల్లడించారు. దుబ్బాక మండలం చిన్ననిజాంపేటకు చెందిన కోనాపురం చంద్రశేఖర్ (24)కు తొగుట మండలం గుడికందుల గ్రామానికి చెందిన శ్యామల (19)తో మార్చి 23న వివాహమైంది. గుడికందులకే చెందిన శివకుమార్ (20) శ్యామల మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరి మధ్య ఇల్లీగల్ ఎఫైర్ కూడా ఉంది. పెద్దల ఒత్తిడితో చంద్రశేఖర్ను వివాహమాడిన శ్యామల.. ప్రియుడు శివకుమార్తో కలిసి హత్యకు ప్రణాళిక రూపొందించింది.
ఏప్రిల్ 19న ఆహారంలో ఎలుకల మందు కలిపి చంద్రశేఖర్ను చంపేందుకు ప్రయత్నించింది. ఆహారం తిన్న చంద్రశేఖర్ అస్వస్తతకు గురై హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొంది ఇటీవలే ఇంటికి తిరిగి వచ్చాడు. ఆహారంలో తేడా రావడంతోనే తాను అస్వస్తతకు గురయ్యానని అప్పట్లో భావించాడు. చంద్రశేఖర్ను చంపేందుకు చేసిన ప్రయత్నం విఫలం కావడంతో శ్యామల మరో ప్రణాళిక రూపొందించింది. ఆలయంలో మొక్కు ఉందంటూ ఏప్రిల్ 28న చంద్రశేఖర్ను వెంట బెట్టుకుని ద్విచక్ర వాహనంపై వెళ్లింది. అనంతసాగర్ శివారులో ఏకాంతంగా గడుపుదామంటూ నమ్మబలికి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లింది. అప్పటికే అక్కడ మాటు వేసిన ప్రియుడు శివకుమార్ అతని స్నేహితులు రాకేష్, రంజిత్, మేనబావ సాయికృష్ణ, వరుసకు సోదరుడు భార్గవ్తో కలిసి కారును చంద్రశేఖర్ ద్విచక్ర వాహనానికి అడ్డుగా పెట్టారు. నలుగురి సహకారంతో చంద్రశేఖర్ను అదిమి పట్టిన శ్యామల, శివ కలిసి రుమాల్తో గొంతు నులిమి హతమార్చారు.
చాతిలో నొప్పి రావడంతో గుండె పోటు వచ్చి చంద్రశేఖర్ చనిపోయాడని శ్యామల తమ బంధువులకు సమాచారం అందించింది. చంద్రశేఖర్ తల్లి మణవ్వ, కుటుంబ సభ్యులు అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. శ్యామల ప్రియుడు శివకుమార్తో కలిసి చంద్రశేఖర్ను అంతమొందించినట్టు పోలీసుల ఎదుట వాంగ్మూలం ఇచ్చింది. హత్యకు కారకులైన ఆరుగురు నిందితులను ఆదివారం సిద్దిపేటలో న్యాయమూర్తి హాజరు పరిచిన పోలీసులు న్యాయస్థానం ఆదేశం మేరకు జ్యుడిషయల్ రిమాండ్కు తరలించారు. నేరానికి పాల్పడిన ఆరుగురు నిందితులు 25 ఏళ్లలోపు వారే కావడం గమనార్హం.