Saturday, April 27, 2024

AP: జగనన్న వసతి దీవెన.. తల్లుల ఖాతాల్లో రూ.1,024 కోట్లు జమ

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఏపీ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో ‘జగనన్న వసతి దీవెన’ పథకం కింద శుక్రవారం సీఎం వైఎస్‌ జగన్‌ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.1,024 కోట్లు జమ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2021–22 విద్యా సంవత్సరానికి రెండో విడత కింద 10,68,150 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఈ మొత్తాన్ని బటన్‌ నొక్కి సీఎం జమ చేస్తారు. ఇందుకు నంద్యాల ఎస్‌పీజీ గ్రౌండ్‌ వేదిక కానుంది. నగదు జమ చేశాక సీఎం వైఎస్‌ జగన్‌ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. 

పేదరికం కారణంగా ఏ విద్యార్థి ఉన్నత చదువులకు దూరం కాకూడదు.. చదువుల ఖర్చుతో తల్లిదండ్రులు అప్పులపాలు కాకూడదన్న సమున్నత లక్ష్యంతో జగనన్న విద్యాదీవెనను ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. భోజనం, వసతి ఖర్చులకూ విద్యార్థులు ఇబ్బంది పడకుండా జగనన్న వసతి దీవెన పథకాన్ని అందిస్తోంది. ఏటా రెండు వాయిదాల్లో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్‌ తదితర కోర్సులు అభ్యసించేవారికి రూ.20 వేల చొప్పున ప్రభుత్వం ఇస్తోంది. 

ఈ పథకం కింద ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్‌ తదితర కోర్సులు చదివే అర్హులైన పేద విద్యార్థులు కళాశాలలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తోంది. అంతేకాకుండా క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఫీజుల మొత్తాలను నేరుగా జమ చేస్తోంది. మొన్ననే జగనన్న విద్యా దీవెన కింద అక్టోబర్‌– డిసెంబర్, 2021 త్రైమాసికానికి పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌గా రూ.709 కోట్లు ఆ త్రైమాసికం పూర్తయిన వెంటనే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ జమ చేశారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement