Saturday, May 4, 2024

పాడేరులో ఘ‌నంగా ఇటుక‌ల పండుగ – సంబ‌రాలు చేసుకుంటోన్న గిరి పుత్రులు

అల్లూరి సీతారామారాజు జిల్లా పాడేరులో ఘ‌నంగా ఇటుక‌ల పండుగ జ‌రిగింది. గిరిపుత్రుల ఆట‌పాట‌ల‌తో సంద‌డిగా బ‌డ్డు ఉత్స‌వం జ‌రిగింది. ఆడ‌ప‌డుచులు, వ‌దినా మ‌ర‌ద‌ళ్ల మ‌ధ్య పోటా పోటీ నెల‌కొంది. కాగా వారం రోజుల పాటు ఈ ఇటుక‌ల పండుగ‌ని ఘ‌నంగా జ‌రుపుకోనున్నారు గిరి పుత్రులు. మండలంలోని గిరిజనులు ఇటుకల పండుగను గురువారం జరుపుకున్నారు. సరికొత్త ఉత్సాహంతో సంప్రదాయకంగా గిరిజనులంతా కలిసికట్టుగా ఈ పండుగను జరుపుకోవడంతో గ్రామాలలో సందడి వాతావరణం నెలకొంది. మహిళలు, చిన్నారులు ధింసా నృత్యాలతో బుడియాల సేకరణతో ఆనందంగా గడిపారు. రంగు నీళ్లు చల్లుకుంటూ ఊయాలలో ఊగుతూ ప్రధాన రహదారులపై గేట్లు ఏర్పాటు చేసి వచ్చే పోయే వాహనాలను అడ్డగించి భజోర్ పేరిట డబ్బులు వసూలు చేస్తూ సందడి చేసారు. గిరిజన పెద్దల నిర్ణయం ప్రకారం ప్రతి సంవత్సరం గ్రామాలలో ఈ ఇటుకల పండుగను ఎంతో సంబరంగా జరుపుకుంటారు. ఇటుకల పండుగ సందర్భంగా పురుషులు మారణ ఆయుధాలను చేతబట్టుకుని అడవులకు వెళ్లి వన్య ప్రాణులను వేటాడి గ్రామాలకు తీసుకురావడం, వాటి మాంసాన్ని వాటాలుగా వేసి ఇంటింటికి పంపకం చేయడం గిరిజన సంప్రదాయంలో ఒక భాగంగా చెప్పవచ్చు. కాయకష్టం చేసి పండించే పంటల దిగుబడి ఘనంగా పెరగాలంటూ కుల దైవాన్ని ఆరాధించడం ఈ పండుగ ముఖ్య ఉద్ధేశ్యం.

Advertisement

తాజా వార్తలు

Advertisement