Sunday, April 28, 2024

ఆడాళ్ల‌ను కించపరిచేలా బాడీ స్ప్రే యాడ్స్‌.. ఇదేం తీరంటూ కేంద్రం సీరియ‌స్ వార్నింగ్‌

స్త్రీలపై ద్వేషపూరితంగా, అత్యాచారాలను ప్రోత్సహించేలా ఉన్న కొన్ని బాడీ స్ప్రే యాడ్స్​ ప్రసారంపై చర్యలు తీసుకోవాలంటూ ఢిల్లీ మహిళా కమిషన్ రాసిన లేఖను కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పరిగణనలోనికి తీసుకుంది. దీనిలో భాగంగా సదరు యాడ్ ఏజెన్సీలకు కేంద్రం నోటీసులు జారీ చేసింది. ఈ తరహా వివాదాస్పద డియోడరెంట్ ప్రకటనలను తక్షణం సస్పెండ్ చేయాలని ఆదేశించింది. అలాగే అడ్వర్టైజింగ్ కోడ్ ప్రకారం ఇట్లాంటి ప్రకటనలపై విచారణ జరుగుతుందని కేంద్రం కాస్త సీరియస్​గానే హెచ్చరించింది. కాగా.. మాస్ మీడియాలో స్త్రీ ద్వేషపూరిత ప్రకటనలను ప్రసారం చేయవద్దని డిమాండ్ చేస్తూ ఢిల్లీ మహిళా కమిషన్ కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌కు లేఖ రాసింది.

పెర్ఫ్యూమ్ బ్రాండ్ Layer’r Shotపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో భగ్గమనడంతో ఈ తరహా ప్రకటనలపై వివాదం చెలరేగింది. ఈ ప్రకటన ‘‘గ్యాంగ్ రేప్ సంస్కృతిని ప్రోత్సహించేలా ఉందని’’ ఇవ్వాల (శనివారం) మహిళా కమిషన్ పేర్కొంది. అంతేకాకుండా ఈ విషయంపై తక్షణం విచారణ చేపట్టాలని ఢిల్లీ పోలీస్ శాఖను సైతం ఆదేశించింది. దీంతో Layer’r Shot వాణిజ్య ప్రకటనకు సంబంధించి కేంద్ర ప్రసార శాఖకు కమిషన్ లేఖ రాసింది. ఈ ప్రకటనను తక్షణం నిషేధించేలా చర్యలు తీసుకోవాలని కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. అత్యాచార సంస్కృతిని ప్రోత్సహించే ఇలాంటి మురికి ప్రకటనలు మళ్లీ ప్రసారం కాకుండా ఉండేలా కొన్ని తనిఖీలు, ప్రామాణికతను నిర్థారించడానికి బలమైన వ్యవస్థ ఉండేలా చూడాలని మలివాల్ కోరారు. అలాగే సదరు పెర్ఫ్యూమ్ బ్రాండ్‌పై భారీ జరిమానా విధించాలని డిమాండ్ చేశారు.

దీంతో ఇతర కంపెనీలు.. చౌకబారు ప్రచారం కోసం చెత్త వ్యూహాలు అమలుచేయవని స్వాతి మలివాల్ వ్యాఖ్యానించారు. ఇక.. ఈ వ్యవహారంపై తీసుకున్న చర్యల నివేదికను జూన్ 9లోగా తమకు సమర్పించాలని ఢిల్లీ పోలీసులను కమిషన్ ఆదేశించింది. ఢిల్లీ పోలీసులు, ప్రసార మంత్రిత్వ శాఖ ఏమాత్రం కాలయాపన లేకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని స్వాతి కోరారు. కాగా.. భారత్‌కు చెందిన పర్‌ఫ్యూమ్‌, డియోడ్రంట్‌, స్ప్రే ఉత్పత్తిదారు ‘‘లేయర్స్‌’’ కంపెనీ తన ఉత్పత్తుల ప్రచారానికి సంబంధించి తాజాగా రూపొందించిన రెండు యాడ్స్‌పై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెండూ ప్రకటనలు కూడా డబుల్‌ మీనింగ్ తో.. యువతులను అగౌరవపరిచేలా, కించపరిచేలా ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి.

ఓ షాపింగ్‌మాల్‌లో కొందరు ఫ్రెండ్స్, ఓ యువతి మధ్య ఒక యాడ్ రూపొందించగా.. మరో యాడ్ ను ఓ రూమ్ లో ఓ యువజంట‌ ఏకాంతంగా ఉండగా, అదే సమయంలో అతడి ఫ్రెండ్స్ రూమ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో జరిగే సంభాషణల ఆధారంగా యాడ్‌ను రూపొందించారు. ఈ రెండు యాడ్స్‌ మెయిన్‌ థీమ్‌ కూడా ‘షాట్‌’ను ప్రమోట్‌ చేసేదే. అయితే ప్రమోషన్‌ సంగతి ఎలా ఉన్నా.. దీని వెనుక చెత్త ఆలోచన ఉందంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఇంగ్లండ్‌ న్యూజిలాండ్‌ టెస్ట్‌ మ్యాచ్‌ సందర్భంగా ఈ వాణిజ్య ప్రకటనలను ప్రచారం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement