Sunday, April 28, 2024

ఈశాన్యంలో మ‌ళ్లీ కాషాయం రెప‌రెప‌లే…

న్యూఢిల్లి: ఈశాన్యంలో మూడు రాష్ట్రాల అసెంబ్లి ఎన్నికల ప్రక్రియ ముగిసింది. త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌ ఎన్నికల్లో మరోసారి బీజేపీ ఆధిపత్యం కొనసాగొచ్చని ఎగ్జిట్‌పోల్స్‌ అంచనా వేశాయి. త్రిపురలో ప్రాంతీయ పార్టీ ఐపీఎఫ్‌టీ మద్దతుతో కమలనాథులు ప్రభుత్వం ఏర్పాటు చేసే సూచనలు కనిపిస్తున్నాయని మెజారిటీ సర్వేలు పేర్కొన్నాయి. అదేవిధంగా నాగాలాండ్‌లోనూ నేషనలిస్టు డెమొక్రాటిక్‌ ప్రొగ్రెసివ్‌ పార్టీతో కలిసి బీజేపీ సంకీర్ణం ఖాయమని చెబుతున్నాయి. మేఘాలయలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం లేదని, హంగ్‌ అసెంబ్లి తప్పదని ఎగ్జిట్‌పోల్స్‌ వెల్లడించాయి.


త్రిపుర:
త్రిపురలో కాషాయ పార్టీదే అధికారమని ఇండియా టుడే యాక్సిస్‌ మై ఇండియా సర్వే స్పష్టంచేసింది. ఇక్కడ బీజేపీకి 45 శాతం ఓట్లు లభిస్తాయని, 60 స్థానాలున్న అసెంబ్లిలో బీజేపీకి 36-45 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఇక వామపక్షాలకు 6-11 సీట్లు, టీఎంసీకి 9-16 సీట్లు దక్కొచ్చని పేర్కొంది. కింగ్‌మేకర్‌ అవుతానని భారీ ఆశలతో ఉన్న త్రిపా మొతా పార్టీకి 20శాతం ఓటింగ్‌ సాధించనుందని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి.
టౌమ్స్‌ నౌ ప్రకారం, బీజేపీ కూటమికి 21-27 సీట్లు, వామపక్షాలకు 18-24 సీట్లు లభించొచ్చు.
మేఘాలయ
60 సీట్లున్న అసెంబ్లిలో ఎన్‌పీపీ 18-24 సీట్లు, కాంగ్రెస్‌ 6-12 స్థానాల్లో, బీజేపీ 4-8 చోట్ల విజయం సాధించే అవకాశాలున్నాయి. ఇతరులు 4-8 చోట్ల గెలవొచ్చని ఇండియా టుడే ఎగ్జిట్‌పోల్స్‌ వెల్లడించాయి. టైమ్స్‌ నౌ ప్రకారం, బీజేపీకి 3-6 సీట్లు, కాంగ్రెస్‌కు 2-5 సీట్లు, ఎన్‌పీపీకి 18-26 సీట్లు దక్కనుండగా, జీన్యూస్‌ సర్వే ప్రకారం, బీజేపీ6-11, కాంగ్రెస్‌ 3-6, ఎన్‌పీపీ 21-26 సీట్లు గెలిచే చాన్స్‌ ఉంది.
నాగాలాండ్‌
ఇక్కడ మరోసారిఎన్‌డీపీపీ సంకీర్ణ కూటమి అధికారంలోకి రానుంది. ఈ కూటమి 38-48 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. మిగతా పార్టీలలో ఎన్‌పీఎఫ్‌ 3-8 సీట్లు, కాంగ్రెస్‌ 1-2 సీట్లు, ఇతరులు 5-15 సీట్లు సాధించొచ్చని ఎగ్జిట్‌పోల్‌ ్స అంచనా వేశాయి. బీజేపీ ప్లస్‌ ఎన్‌డీపీపీ కూటమికి 35-43 సీట్లు, కాంగ్రెస్‌ 1-3, ఎన్‌పీఎఫ్‌కు 2-5 స్థానాలు లభించే అవకాశం ఉందని జీ న్యూస్‌ అంచనా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement