Monday, May 13, 2024

Big Blow – రాజ‌స్థాన్ లో సచిన్ పైలెట్ కొత్త కుంప‌టి…

న్యూఢిల్లి: రాజస్థాన్‌ డిప్యూటీ సీఎం సచిన్‌ పైలెట్‌ కాంగ్రెస్‌ పార్టీతో తెగదెం పులు చేసుకోవడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం. మరికొద్ది మాసాల్లో రాష్ట్ర అసెంబ్లికి ఎన్నికలు ముంచుకొస్తాయనగా అటు పార్టీలో ఇటు ప్రభుత్వం పై ఆధిపత్యం కోసం ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌తో ఘర్షణకు దిగిన సచిన్‌.. సొంత పార్టీ పెట్టే ప్రయత్నాల్లో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

సచిన్‌ ప్రతి అడుగులోనూ ఐ-ప్యాక్‌ వ్యూహం
ఈ యావత్‌ ప్రక్రియలో సచిన్‌ పైలెట్‌కు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌కు చెందిన రాజకీయ కన్సల్టెన్స్‌ కంపెనీ ఐ-ప్యాక్‌ సాయం చేస్తున్నట్టు సమాచారం. ఏప్రిల్‌ 11న పైలెట్‌ చేపట్టిన ఒకరోజు నిరాహార దీక్షకు ఐ-ప్యాక్‌ వలంటీర్లు సాయపడినట్టు తెలిసింది. వసుంధర రాజే సీఎంగా ఉండగా రాష్ట్రం లో చోటు చేసుకున్న అవినీతిపై గెహ్లాట్‌ సర్కారు చర్య తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ సచిన్‌ నిరాహార దీక్ష చేపట్టారు. ఉద్యోగ నియామక పరీక్షలకు చెందిన పేపర్ల లీకేజ్‌పై చర్య కోసం ఒత్తిడి చేస్తూ అజ్మీర్‌ నుంచి జైపూర్‌ వరకు ఆయన ఐదురోజుల పాటు చేపట్టిన పాదయాత్రకు పథక రచన చేసింది ఐ-ప్యాక్‌ వ్యూహకర్తలేనని సమాచారం.

మే 15న జైపూర్‌ శివార్లలో యాత్ర ముగింపును పురస్కరించుకొని ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించిన సచిన్‌ పైలెట్‌ గెహ్లాట్‌ సర్కారు ముందు మూడు డిమాండ్లు ఉంచారు. వసుంధ రాజే హయాంలో అవినీతిపై చర్యలు, రాజస్థాన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పునరుద్ధరణ, పరీక్షా పేపర్ల లీకేజీలో బాధితులైన యువతకు పరిహారం చెల్లించాలని పైలెట్‌ పట్టుపట్టారు. డిమాండ్ల పరిష్కారానికి మే 31వరకు గడువు పెట్టారు. డిమాండ్లు తీర్చని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించా రు. తన తండ్రి రాజేశ్‌ పైలెట్‌ వర్థంతి రోజైన జూన్‌ 11న సచిన్‌ పైలెట్‌ ఒక కీలకమైన ప్రకటన చేస్తారనే ఊహగానాలు రాజస్థాన్‌ రాజకీయ వర్గాల్లో ఊపందుకున్నాయి. ఆ సందర్భంగా ఒక బహిరంగ సభను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారని సమాచారం. అదే రోజున కొత్త పార్టీకి సంబంధించిన ప్రణాళిక లను సచిన్‌ పైలెట్‌ ప్రకటిస్తారని తెలిసింది. కొత్త పార్టీకి ‘ప్రగతిశీల్‌ కాంగ్రెస్‌’ అనే పేరుపెట్టినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.

మే 29న కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీలతో అశోక్‌ గెహ్లాట్‌, సచిన్‌ పైలెట్‌ విడివిడిగా బేటీ అయ్యారు. భేటీ అనంతరం పైలెట్‌, గెహ్లాట్‌లను కలిపి ఒక ఫొటో తీయడానికి విఫలం కావడం, రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ పార్టీగా రెండుగా చీలిపోయిందనేందుకు నిదర్శనమని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ సంఘటన జరిగిన రెండు రోజుల తర్వాత తన నియోజకవర్గం టోంక్‌లో పర్యటించిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గెహ్లాట్‌ ప్రభుత్వం ముందు తాను ఉంచిన మూడు డిమాండ్ల విషయంలో రాజీపడే ప్రసక్తి లేదని సచిన్‌ పైలెట్‌ అన్నారు. అయితే మంగళ వారం న్యూఢిల్లిdలో కాంగ్రెస్‌ హైకమాండ్‌ అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించింది. రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో సంక్షోభాన్ని పరిష్కరించే బాధ్యతను పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌కు అప్పగించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement