Thursday, May 2, 2024

ట్రీ సిటీగా భాగ్యనగరం, రెండోసారి దక్కిన ఘనత.. సీఎం కేసీఆర్‌ చర్యలే కారణమన్న ఎంపీ సంతోష్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ నగరం వరుసగా రెండో సారి ట్రీ సిటీగా ఎంపికైంది. ప్రపంచవ్యాప్తంగా పచ్చదనాన్ని పెంపొందిస్తున్న నగరాలను గుర్తించి ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ది యునైటెడ్‌ నేషన్స్‌(యూఎన్‌ఎఫ్‌ఏవో), ఆర్బొర్‌ డే ఫౌండేషన్‌ సంయుక్తంగా ట్రీ సిటీలను ఎంపిక చేస్తాయి. ప్రపంచంలో ట్రీసిటీగా ఎంపికైన నగరాల్లో వరుసగా రెండోసారి హైదరాబాద్‌ నగరం చోటు సంపాదించడం విశేషం. రెండేళ్లకోసారి ఈ ట్రీ సిటీలను ఎంపిక చేస్తుండగా.. 2020లోనూ ట్రీ సిటీగా హైదరాబాద్‌ గుర్తింపు పొందింది. గత రెండేళ్లల్లో నగరంలో 3 కోట్ల 50 లక్షల 56 వేల 635 మొక్కలు నాటినట్టు ఆర్బొర్‌ డే ఫౌండేషన్‌ పేర్కొంది. ఇందుకోసం దాదాపు 500 గంటల సమయాన్ని కేటాయించాల్సి ఉంటుందని అభిప్రాయపడిన ఫౌండేషన్ హైదరాబాద్‌కు ఈ సందర్భంగా అభినందనలు తెలిపింది.

ఈ ఘనత సీఎం కేసీఆర్‌దే: ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్
హైదరాబాద్‌ వరుసగా రెండోసారి ట్రీ సిటీ గుర్తింపు దక్కించుకోవటం పట్ల ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్రీ సిటీ గుర్తింపునకు సంబంధించిన ఫొటోలను ఆయన మంగళవారం ట్విట్టర్లో పోస్టు చేశారు. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌(జీఐసీ)లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. 2021కు గాను ఆర్బొర్‌ డే ఫౌండేషన్‌ ద్వారా #హదరాబాద్‌ ఈ గుర్తింపు దక్కించుకోవటం ఆనందంగా ఉందని సంతోష్‌ పేర్కొన్నారు. తెలంగాణలో #హరితహారం కార్యక్రమాన్ని చేపట్టి పచ్చదనానికి శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్‌కే ఈ గౌరవం దక్కుతుందని ఆయన పేర్కొన్నారు. మున్సిపల్‌ శాఖ మంత్రిగా కేటీఆర్‌ సైతం మొక్కల పెంపకంలో కీలక పాత్ర పోషించారంటూ అభినందనలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement