Thursday, April 25, 2024

ఆనందయ్య మందుపై హైకోర్టులో విచారణ.. వచ్చే సోమవారానికి వాయిదా

కరోనా రెండో దశ కల్లోలం నేపథ్యంలో నెల్లూరు ఆనందయ్య మందుకు డిమాండ్‌ పెరుగుతోంది. ఆనందయ్య మందును ప్రభుత్వమే పంపిణీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఆనందయ్య మందుపై అధ్యయనం జరుగుతోందని, ఈనెల 29న రిపోర్టులు వస్తాయని ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. దీనిపై స్పందించిన హైకోర్టు.. రిపోర్టులు త్వరగా వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వం, ప్రజలు మందు కావాలని ఎదురుచూస్తున్నారని, వీలైనంత త్వరగా రిపోర్టులు రావాలని హైకోర్టు తెలిపింది.

అయితే విచారణ సందర్బంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాదనలు వినిపించాయి. రాష్ట్ర ప్రభుత్వం అసలు ఆనందయ్య తన మందును ఆయుర్వేద కౌన్సిల్‌లో రిజిస్టర్ చేసుకోలేదని తెలిపింది. దీనిపై ఆనందయ్య తరఫు న్యాయవాది అశ్వనీకుమార్‌ స్పందిస్తూ.. మందును ప్రభుత్వం గుర్తించాలని ఇప్పటికే పిటిషన్ వేశారని గుర్తుచేశారు. అటు కేంద్ర ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ అసలు ఆనందయ్య మందులో ఏం కలుపుతున్నారో తెలుసుకుని, దాని వల్ల ప్రజలకు ఇబ్బంది లేదంటే కేంద్ర ఆయుష్‌ శాఖ అనుమతి ఇస్తుందన్నారు. మరోవైపు ఆనందయ్య మందు పంపిణీ ఆపాలని లోకాయుక్త ఎలా ఆదేశాలు ఇస్తుందని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కృష్ణయ్య ప్రశ్నించారు. ఆనందయ్యతో ప్రైవేట్‌గా మందు తయారు చేయిస్తున్నారని మరో పిటిషనర్‌ న్యాయవాది బాలాజీ కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో హైకోర్టు విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement