Saturday, May 18, 2024

AP Govt: పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు

వేతన సవరణకు సంబంధించచిన అంశాలపై చర్చించేందుకు ఉద్యోగ సంఘాలను ప్రభుత్వం ఆహ్వానించింది. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో ఉద్యోగ సంఘాల నేతలు సమావేశం కానున్నారు. ఇప్పటికే పీఆర్సీపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ నివేదిక సమర్పించింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం చర్చలకు రావాల్సిందిగా ఆహ్వానించింది. కమిటీ రిపోర్ట్ లో పేర్కొన్న 14.29 శాతం ఫిట్ మెంట్, వచ్చే ఏడాది నగదు చెల్లింపులు, హెచ్ ఆర్ఏ తగ్గింపు తదితర అంశాలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది.

మరోవైపు కేవలం వీటిపైనే చర్చించేందుకు తాము సిద్ధంగా లేమని, తమ మొత్తం 71 డిమాండ్లపైనా చర్చించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అయితే, ప్రస్తుతానికి పీఆర్సీపై చర్చలకు రావాలన్న ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ఉద్యోగులు చర్చకు వెళ్తున్నట్టు తెలుస్తోంది.

కాగా, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలోని కార్యదర్శుల కమిటీ ప్రభుత్వానికి సోమవారం తన సిఫార్సులతో కూడిన నివేదిక సమర్పించింది. కొత్త పీఆర్సీ నగదు ప్రయోజనం 2022 అక్టోబరు నుంచి ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలోని కమిటీ సిఫార్సు చేసింది. ఫిట్‌మెంట్‌ 14.29% ఇస్తే సరిపోతుందని అభిప్రాయపడింది. ఇంటి అద్దె భత్యం విషయంలోనూ కేంద్ర వేతన సవరణ సంఘం సిఫార్సుల మేరకు నడుచుకోవాలని సూచించింది.

అయితే, ప్రభుత్వ కమిటీ ప్రతిపాదనపై ఉద్యోగ సంఘాలు అసంతృఫ్తి వ్యక్తం చేశారు. 2018 జులై 1న పీఆర్సీ అమలు చేయాలని కోరితే వచ్చే ఏడాది అక్టోబరు నుంచి ఆర్థిక ప్రయోజనాలు అందిస్తామనడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని స్పష్టం చేశారు. తమ 71 డిమాండ్లలో పీఆర్సీ ఒకటని, మిగతా 70 సమస్యలూ పరిష్కరిస్తేనే ఉద్యమాన్ని విరమిస్తామని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement