ఉత్తర ప్రదేశ్ లోని ప్రతి మూలను విశాలమైన, ఆధునిక రహదారి -ఎక్స్ ప్రెస్ వేతో అనుసంధానించే పని వేగంగా జరుగుతోంది. ఇది రక్షణ కారిడార్గా ఉంటుంది. పూర్వాంచల్ కు ఎక్స్ ప్రెస్ వే లేదా బుందేల్ ఖండ్ ఎక్స్ ప్రెస్ వే, గోరఖ్ పూర్ లింక్ వే లేదా గంగా ఎక్స్ ప్రెస్ వే.. ఇవన్నీ ఈ దశాబ్దంలో ఉత్తరప్రదేశ్ అభివృద్ధిని కొత్త తీరాలకు తీసుకువెళతాయి. ఈ మార్గాల్లో రైళ్లను నడపడమే కాకుండా స్వీయ -ఆధారిత భారతదేశాన్ని బలోపేతం చేసే కొత్త పారిశ్రామిక క్లస్టర్లను కూడా సృష్టిస్తాయి.
– బుందేల్ఖండ్ ఎక్స్ప్రేస్ వే ప్రారంభోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ..
అత్యాధునిక టెక్నాలజీతో, సౌకర్యవంతంగా నిర్మించిన ఎక్స్ ప్రెస్వే ఇప్పుడు ప్రమాదంలో పడింది. ప్రారంభించిన అయిదు రోజులకే బ్రిడ్జి కూలిపోయింది. అటు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం, ఇటు యూపీలోని యోగీ సర్కారు చేపట్టిన ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ఇట్లా దెబ్బతినడంతో బీజేపీ వర్గాలకు నోటిమాట రావడం లేదు. వేల కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రతిష్ఠాత్మక బ్రిడ్జి ఇట్లా కూలిపోవడంపై అధికారక వర్గాలు, బీజేపీ లీడర్లు అంతర్మథనంలో పడ్డారు. దీనిపై విపక్షాల నుంచి, సోషల్ మీడియాలోనూ విపరీతమైన కామెంట్స్, మీమ్స్ వస్తున్నాయి. అందులో మెయిన్గా చెప్పుకోవాల్సింది ఎంటంటే.. ప్రధాని మోదీ నిత్యం పలికే వచనాలతో దీన్ని రూపొందించారు.
‘‘మిత్రో ఇదే మా అభివృద్ది”అంటూ ప్రధాని ఫొటోతో పాటు.. కుప్పకూలిన బ్రిడ్జి భాగాన్ని కనిపించేలా మీమ్ తయారు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అవినీతి ఎలా తాండవిస్తుందో చెప్పడానికి ఇదే ఒక ఉదాహరణ అని ఆ మీమ్లో రాసుకొచ్చారు. ఇక.. డబుల్ ఇంజిన్సర్కారు చేసిన ఈ సిగ్గుమాలిన పని అంటూ చాలామంది ట్రోల్స్ చేస్తున్నారు.
ఇక.. జులై 16న ప్రధాని మోదీ ప్రారంభించగా.. జులై 22న బ్రిడ్జి కుప్పకూలడంపై బీజేపీ లీడర్లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రతిపక్షాలతోపాటు సోషల్ మీడియాలో ఎదురయ్యే ప్రశ్నలను ఎట్లా తట్టుకోవాలే అనే ఆలోచనలలో పడ్డట్టు తెలుస్తోంది.