Wednesday, May 1, 2024

ఏపీలో ప్రతి నియోజకవర్గంలో ఒక కోవిడ్ సెంటర్: మంత్రి ఆళ్ల నాని

గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కరోనా పరిస్థితులపై సమీక్ష సమావేశం నిర్వహించింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి హోంమంత్రి మేకతోటి సుచరిత, గుంటూరు జిల్లా కలెక్టర్, వైద్య ఆరోగ్య అధికారులు, జిల్లా ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ప్రతి నియోజకవర్గంలో ఒక కోవిడ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. 40 పడకలు ఉన్న ఆసుపత్రులను కొవిడ్ సెంటర్లుగా మార్చుతామని తెలిపారు. కరోనా రోగుల ప్రైమరీ కాంటాక్టుగా గుర్తించిన వారందరికీ పరీక్షలు జరపాలని అధికారులకు స్పష్టం చేశారు. కరోనా పరీక్షల రిపోర్టులు 24 గంటల్లోగా వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 104 సేవలను మరింత సమర్థవంతంగా అందించాలని, ఫోన్ చేసిన 3 గంటల్లో బెడ్ కేటాయించే విధంగా చర్యలు ఉండాలని నిర్దేశించారు.

ప్రస్తుతం ఏపీకి 390 టన్నుల ఆక్సిజన్ అవసరం కాగా 360 టన్నులు మాత్రమే అందుబాటులో ఉందని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. పూర్తిస్థాయిలో ఆక్సిజన్ సరఫరా చేయాలని కేంద్రానికి లేఖ రాశామన్నారు. స్టీల్ ప్లాంట్ నుంచి రోజుకు 100 టన్నుల ఆక్సిజన్ సరఫరా అవుతోందని, మిగతా ఆక్సిజన్ తమిళనాడు, బళ్లారి నుంచి వస్తోందన్నారు. ఆక్సిజన్‌కు ఏర్పడిన ప్రాధాన్యత దృష్ట్యా ప్రాణవాయువు వృథా కానివ్వరాదని, దీనిపై వైద్యాధికారులు దృష్టి సారించాలని మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రెమ్ డెసివిర్ ఇంజెక్షన్లకు కొరత లేదని, ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ రెమ్ డెసివిర్ ఇంజెక్షన్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement