Sunday, May 5, 2024

నీలాంటోళ్లు ఉండాలే సామీ.. కూడబెట్టిన డబ్బంతా పేదల చదువుకు గిఫ్ట్‌గా..

ఎంత సంపాదించామన్న‌ది ముఖ్యం కాదు.. ఎంత మంది మ‌న‌ల్ని చిర‌కాలం గుర్తుంచుకుంటున్నార‌న్న‌ది ముఖ్యం.. ఇది ఓ సినిమాలో డైలాగే అయినా.. నేటి స‌మాజంలో చాలామంది డ‌బ్బును కూడ‌బెడుతూ కోట్ల‌కు ప‌డ‌గ‌లెత్తుతున్న వారున్నారు. పేద‌లు మ‌రింత నిరుపేద‌లుగా ఉండిపోతున్నారు. కానీ, ఇట్లాంటి ముచ్చ‌ట చ‌ద‌విన‌ప్పుడు, విన్న‌ప్పుడు స‌మాజంలో ఇంకా మాన‌వ‌త్వం, మంచిత‌నం ఉన్నాయ‌నిపిస్తుంటుంది..

కొందరికి సమాజంపై వ‌ల్ల‌మాలిన‌ ప్రేమ ఉంటుంది. దాని కోసం తమ జీవితాన్ని కూడా ధార పోసిన‌వారున్నారు. ఇంకొందరైతే తమ ఆస్తిపాస్తులను మొత్తం సమాజం కోసం వెచ్చిస్తారు. అయితే, ఇప్పుడు చెప్పుకోబోయే ఉపాధ్యాయుడు మాత్రం వీరికి కొంచెం భిన్నం. 39 ఏళ్ల‌పాటు ఉపాధ్యాయుడిగా పనిచేసిన ఆయన ఆ కాలంలో సంపాదించిన తన కష్టార్జితం మొత్తం రూ. 40 లక్షలను పేద పిల్లల చదువు కోసం విరాళంగా ఇచ్చేసి తన పెద్ద మనసును చాటుకున్నారు. ఉపాధ్యాయుడిగా వేలాదిమంది మందిని తీర్చిదిద్దినప్పటికీ అది ఆయనకు సంతృప్తినివ్వలేదు. వారి కోసం ఇంకేదో చేయాలన్న ఉద్దేశంతో తాను సంపాదించిన రూ. 40 లక్షలను పేద విద్యార్థుల చదువు కోసం గిఫ్ట్‌గా ఇచ్చేశారు.

ఆ ఉపాధ్యాయుడి పేరు విజయ్ కుమార్ చాన్సోరియా. మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాలోని ఖాందియాకు చెందిన ఆయన ఉద్యోగ విరమణ సందర్భంగా తీసుకున్న నిర్ణయమిది. అంతమాత్రాన ఆయనకు భార్యా, పిల్లలు లేరనుకోవడం పొరపాటు. వారి అనుమతితోనే తాను ఇన్నాళ్లుగా దాచుకున్న పీఎఫ్, గ్రాట్యుటీ నిధులను పేద విద్యార్థులకు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోని బాధలన్నింటినీ మనం తగ్గించలేమని, కానీ మనం చేయాల్సిన కాసింత మంచినైనా చేద్దామని అన్నారు. తాను రిక్షా తొక్కి, పాలు అమ్మి చదువుకున్నానని, చదువంటే ఆసక్తి ఉన్న పేద విద్యార్థులకు ఆ కష్టం రాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement