Friday, April 26, 2024

2 కి.మీ. నడిచి వెళ్లి జగన్నాథుడిని దర్శించుకున్న.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

ఒడిశాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. కాగా రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం భువనేశ్వర్‌ చేరుకున్నారు. శుక్రవారం భువనేశ్వర్‌లో 3 స్కూళ్లు, ఆదివాసీ బాలల ఆశ్రమాన్ని రాష్ట్రపతి సందర్శిస్తారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి ముర్ము.. బుధవారం ఉదయం ‘బిజు పట్నాయక్‌’ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఒడిశా గవర్నర్‌ గణేశీ లాల్‌, ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ఆమెకు సాదర స్వాగతం పలికారు. అనంతరం సాయుధదళాల నుంచి రాష్ట్రపతి గౌరవవందనం స్వీకరించారు. అక్కడి నుంచి రాష్ట్రపతి హెలికాప్టర్‌లో పూరీ క్షేత్రానికి చేరుకున్నారు. హెలిప్యాడ్ నుంచి ఆలయానికి కాన్వాయ్‌లో బయల్దేరారు. అయితే, కొంత దూరం వెళ్లిన తర్వాత తన కాన్వాయ్‌ని ఆపించిన రాష్ట్రపతి.. అక్కడి నుంచి కాలినడకన ఆలయానికి బయల్దేరారు. సుమారు 2 కి.మీ. నడిచి వెళ్లి జగన్నాథుడిని దర్శించుకున్నారు. మార్గమధ్యంలో ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. తనకు స్వాగతం పలికిన చిన్నారులను రాష్ట్రపతి ఆప్యాయంగా పలుకరించారు. సుమారు గంట పాటు ఆమె ఆలయ సన్నిధిలో గడిపారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రపతి వెంట కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement