Saturday, April 27, 2024

కోటిన్నరకు చేరువలో కంటివెలుగు పరీక్షలు…

రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతున్న కంటి వెలుగు కార్యక్రమం…

  • ఇప్పటి వరకు 74 పనిదినాల్లో ఒక కోటి 42 లక్షల 30 వేల 576 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు….
  • 20 లక్షల 69 వేల మందికి రీడింగ్ అద్దాలు పంపిణీ..

హైదరాబాద్, మే 14 : ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు వైద్య శిబిరాల్లో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు ఒక కోటి 42లక్షల 30 వేల 576 మందికి పైగా కంటి పరీక్షలు చేయించుకున్నారు. కంటి వెలుగు కార్యక్రమంలో నేటి వరకు.. 20 లక్షల 69 వేల మందికి కంటి అద్దాలు ఇవ్వడం జరిగింది. “అంధత్వ రహిత” తెలంగాణ లక్ష్యం నినాదంతో ప్రారంభించిన కంటి వెలుగు కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతున్నది. గత 12వ తేదీ నాటికి రాష్ట్రంలో 10 వేల 285 గ్రామ పంచాయతీ వార్డుల్లో, 3221 మున్సిపల్ వార్డుల్లో కంటి పరీక్షలు పూర్తి చేశారు. దృష్టి లోపాలు సవరించేందుకు 2018, ఆగస్టు 15న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మెదక్ జిల్లా మల్కాపూర్ లో తొలి విడత కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమం 8 నెలల పాటు కొనసాగింది. కోటి 50 లక్షల మందికి ఉచితంగా కంటి పరీక్షల నిర్వహించారు. 50 లక్షల మందికి కళ్లద్దాలను పంపిణీ చేసారు. అదే స్ఫూర్తితో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని గత జనవరి 18 న ఖమ్మంలో ముఖ్యమంత్రి ప్రారంభించారు.

అనుకున్న లక్ష్యం మేరకు విజయవంతంగా కొనసాగుతున్నది. 74 పనిదినాల్లో 82 శాతం మందికి కంటి పరీక్షలు చేయడం జరిగింది. ల‌క్ష్యంగా నిర్దేశించుక‌న్న 100 పనిదినాల్లో రాష్ట్రంలో అందరికి పరీక్షలు పూర్తి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. కంటి వెలుగు సమయంలో ఇతర వైద్య సేవలకు అంతరాయం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వైద్య శాఖ, పంచాయతీ రాజ్, మున్సిపల్, ఇతర శాఖలు సహా, ప్రజాప్రతినిధులందరూ ఇందులో భాగస్వామ్యమవుతున్నారు. పర్యవేక్షణకు గాను రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో క్వాలిటీ కంట్రోల్ టీంలను ఏర్పాటు చేసి ప్రభుత్వం మానిటరింగ్ చేస్తున్నది. ఇదేవిధంగా కంటివెలుగు కార్యక్రమం కొనసాగితే 2 కోట్ల మందికి కంటివెలుగు పరీక్షలు నిర్వహించే అవకాశం ఉన్నదనే అభిప్రాయాన్ని వైద్యాధికారులు వ్యక్తం చేశారు. దేశంలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రం చేపట్టని కంటివెలుగు కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వం నిర్వహించడం గర్వంగా ఉందని వారు పేర్కొన్నారు.

- Advertisement -

ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత :
సర్వజనుల ఆరోగ్యమే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు కంటి వెలుగు పథకాన్ని తెచ్చింది. ఈపథకాన్ని జనవరి 19 నుంచి జూన్ 15 వరకు 100 రోజుల కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేసేందుకు జిల్లా కలెక్టర్ లు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, పలు శాఖల అధికారులతో కలిసి శిబిరాల నిర్వహణకు ముందుగానే ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ముందస్తు ప్రణాళికలతో, నిరంతర పర్యవేక్షణ, రోజువారి సమీక్షలు, విశ్లేషణ, వీడియో కాన్ఫరెన్స్, సమావేశాలతో ఎప్పటికప్పుడు లోటుపాట్లు సవరించుకుంటూ కంటి వెలుగు కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నారు.


అందత్వరహిత రాష్ట్రంగా తెలంగాణ ….
దగ్గరిచూపు సమస్యలే అధికం….
అన్ని జిల్లాలో అత్యధికంగా దగ్గరిచూపు కనిపించక ఇబ్బందిపడే వారే అధికంగా ఉన్నట్లు శిబిరాలలో నమోదవుతున్న లెక్కలు చెబుతున్నాయి. 40 ఏళ్ల వయస్సు పైబడిన చాలామందికి దగ్గర చూపు కనిపించడం లేదని శిబిరానికి వస్తున్నారు. ఇలాంటి వారికి తక్షణమే రీడింగ్ గ్లాసెస్ అందజేస్తున్నారు. ఇవి కాకుండా కంటి సమస్యలతో వస్తున్న చాలా మందికి చుక్కల మందులతో పాటు విటమిన్ ఏ, డీ, బీకాంప్లెక్స్ టాబ్లెట్లు పంపిణీ చేస్తున్నారు. 50 ఏళ్లు పైబడిన వారు అత్యధికంగా మోతబిందు (కాటరాక్ట్) సమస్యతో బాధపడుతున్నారు. శస్త్ర చికిత్స అవసరమైన వారికి చికిత్స చేసే సమయాన్ని చరవాణి ద్వారా సమాచారం చేరవేస్తున్నామని వైద్య సిబ్బంది చెబుతున్నారు. ఇదివరకే శస్త్ర చికిత్స పూర్తయి ఇతర సమస్యలతో బాధపడుతున్న వారికి వైద్యులు సలహాలు, సూచనలు అందజేస్తున్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో ముందుచూపుతో అందరికి అభివృద్ధి, సంక్షేమఫలాలు అందించుటకు ప్రభుత్వం చేస్తున్న కృషి మంచి ఫలితాలను ఇస్తున్నది. అదే స్ఫూర్తితో ఆరోగ్య కుటుంబ సంక్షేమ పధకాలు అమలులో ముందున్న రాష్ట్రం ఆరోగ్య తెలంగాణగా రూపుదిద్దుకుంటున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement