Thursday, May 2, 2024

కోర్టు ధిక్కార కేసులో శిక్ష విధించిన హైకోర్టు

హైదరాబాద్: సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ పి.వెంకటరామిరెడ్డికి జైలు శిక్ష పడింది. కోర్టు ధిక్కార కేసులో ఆయనకు తెలంగాణ హైకోర్టు మూడు నెలల సాధారణ జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది. ఆయనతో పాటు మరో ఇద్దరికి కూడా హైకోర్టు జైలుశిక్ష, జరిమానాలను విధించింది. గతంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్‌గా పని చేసిన కృష్ణభాస్కర్‌‌కు (ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌) కూడా రూ.2 వేల జరిమానా విధించింది. కొమరవెల్లి మల్లన్నసాగర్‌ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ (భూసేకరణ)గా పని చేసిన జయచందర్‌ రెడ్డికి 4 నెలల సాధారణ జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది. పిటిషనర్లకు కోర్టు ఖర్చుల నిమిత్తం నాలుగు వారాల్లోగా ఒక్కొక్కరు రూ.25వేలు చొప్పున చెల్లించాలని కోర్టు స్పష్టం చేసింది. అధికారులు ఉద్దేశపూర్వకంగానే కోర్టు ఆదేశాలను ధిక్కారించారని న్యాయస్థానం స్పష్టం చేసింది. అప్పీల్‌కు వెళ్లేందుకు ఆరు వారాలపాటు తీర్పును నిలిపివేసింది

కోర్టు ధిక్కార కేసులో జైలు శిక్ష పడిన అధికారులకు ఒక్కొక్కరికి రోజుకు రూ.250 చొప్పున జీవనాధార భత్యాన్ని ఆరు వారాల్లోగా పిటిషనర్లు డిపాజిట్‌ చేయాలని స్పష్టం చేసింది. వేములఘాట్‌ సర్వే నెం.849/1/1, 850/12లలోని 23 గుంటకు పైగా భూమికి సంబంధించి జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌, పరిహారం కింద జిల్లా కలెక్టర్‌ జూలై 2, 2019న జారీ చేసిన అవార్డులను రద్దు చేసింది. భూ సేకరణ చట్టంలోని సెక్షన్‌ 11(1) కింద జూలై 30, 2017న జారీ చేసిన నోటిఫికేషన్‌కు రెండేళ్ల కాలం తీరినందున అది చెల్లదని స్పష్టం చేసింది. భూ సేకరణ చట్టం-2013 కింద జిల్లా కలెక్టర్‌, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌(భూసేకరణ) తాజా నోటిఫికేషన్‌ జారీ చేసి నష్టపరిహారం, ఆర్‌ అండ్‌ ఆర్‌ బెనిఫిట్లను కోర్టు ఆదేశాలు అందిన నాలుగు నెలల్లోగా పూర్తి చేయాలని స్పష్టం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement