Friday, April 26, 2024

ఢిల్లీలో మహిళల బాక్సింగ్ ప్రపంచ చాంపియన్ షిప్.. బహుమతిగా భారీ నగదు

ఢిల్లీ వేదికగా వచ్చే ఏడాది మార్చిలో మహిళల బాక్సింగ్ ప్రపంచ చాంపియన్ షిప్ జరగనుంది.ఈ టోర్నీ నిర్వహణకు అంతర్జాతీయ బాక్సింగ్‌ సంఘం(ఐబీఏ) అధ్యక్షుడు క్రెమ్లెవ్, భారత బాక్సింగ్‌ సమాఖ్య (బీఎఫ్‌ఐ) అధ్యక్షుడు అజయ్‌ సింగ్‌ ఒప్పందం చేసుకున్నారు. 2006, 2018లో కూడా మహిళల చాంపియన్‌షిప్స్‌ భారత్ లోనే జరిగాయి. ఈసారి ఢిల్లీ వేదికగా మార్చిలో టోర్నీ జరగనుంది. పురుషుల మాదిరిగా ఈ టోర్నీకి కూడా నగదు బహుమతి పెంచినట్టు క్రెమ్లెవ్ ప్రకటించారు. మొత్తంగా రూ. 19.50 కోట్ల నగదు కేటాయించినట్టు.. ప్రతి కేటగిరీలో స్వర్ణం గెలిచిన బాక్సర్ రూ. 81 లక్షల నగదు అందుకుంటారని తెలిపారు.ఈ కార్యక్రమంలో గత ఎడిషన్ స్వర్ణ విజేత భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ కూడా పాల్గొంది. భారత్ లో జరిగే టోర్నమెంట్‌లో మళ్లీ గోల్డ్‌ మెడల్‌ సాధిస్తానని నిఖత్‌ జరీన్‌ చెప్పింది. తద్వారా వచ్చే నగదు బహుమతితో మెర్సిడెస్‌ బెంజ్‌ కారు కొంటానని తెలిపింది. ఐబీఏ అధ్యక్షుడు క్రెమ్లెవ్‌ను హైదరాబాద్‌ ఆహ్వానించి బెంజ్‌ కారులో తన ఇంటికి తీసుకెళ్తానని చెప్పింది. దీనిపై స్పందించిన క్రెమ్లెవ్‌ ఒకవేళ నిఖత్‌ గోల్డ్ మెడల్ నిలబెట్టుకుంటే తానే మెర్సెడెస్‌ కారును ఆమెకు బహుమతిగా ఇస్తానని హామీ ఇచ్చారు. దాంతో, వచ్చే ఏడాది మరోసారి ప్రపంచ చాంపియన్ అయితే నిఖత్ రూ. 81 లక్షల నగదుతో పాటు మెర్సిడెస్ కారును బహుమతిగా అందుకోనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement