వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ కోసం సర్వం సిద్ధమైంది. భారత్–ఆస్ట్రేలియా మధ్య ఇవ్వాల డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఏ టీమ్ గెలిచినా అన్ని ఫార్మాట్లలోనూ ఐసీసీ ట్రోఫీ గెలిచిన తొలి జట్టుగా నిలుస్తుంది. అంతేకాకుండా తొలిసారిగా ఈ టెస్టును దక్కించుకున్న జట్టుగా నిలుస్తుంది. ఎంఎస్ ధోనీ నేతృత్వంలో భారత జట్టు 2013లో చాంపియన్స్ ట్రోఫీ ద్వారా చివరిసారిగా ఐసీసీ టోర్నీ సాధించింది. అప్పటి నుంచి దశాబ్దకాలంగా టీమిండియాను ఐసీసీ ట్రోఫీలు ఊరిస్తూనే ఉన్నాయి.
ఇక.. ఇవ్వాల (బుధవారం) మధ్యాహ్నం ఓవల్ స్టేడియంలో ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ ఆరంభం కాబోతోంది. ఐపీఎల్ ముందు ఆసీస్తో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్ను భారత్ 2–1తో గెలిచింది. కానీ, ఇంగ్లండ్లోని పరిస్థితులు తమకే లాభిస్తాయని ఆసీస్ భావిస్తోంది. ఈ మ్యాచ్ గెలవడం ద్వారా భారత్లో జరిగిన బోర్డర్–గవాస్కర్ ట్రోఫీలో సిరీస్ ఓటమికి ఆసీస్ బదులు తీర్చుకోవాలని కసిగా ఉంది.
ఓవల్లో స్టీవ్ స్మిత్కు అద్భుత రికార్డు ఉండడం ఆసీస్ కలిసివచ్చే అంశంగా కనిపిస్తోంది. ఇక్కడ ఆడిన మూడు టెస్టుల్లోనే తను 97.75 సగటుతో 391 పరుగులు సాధించాడు. వార్నర్, ఖవాజా, లబుషేన్, హెడ్, గ్రీన్ ని కట్టడి చేస్తే భారత్కు చాన్సెస్ ఉంటాయని అనలిస్టులు చెబుతున్నారు. భారత్ ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగుతుందా.. లేక నలుగురా.. అనే విషయం మ్యాచ్ ముందే ఓ క్లారిటీ రానుంది. అశ్విన్-జడేజా మధ్య పోటీ ఉండగా.. జడేజాని ఆడించే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు అవగతం అవుతోంది.
ఇక.. పిచ్ను చూశాకే స్పిన్నర్ల ఎంపిక ఉంటుందని కెప్టెన్ రోహిత్ స్పష్టం చేశాడు. కేఎస్ భరత్, ఇషాన్ కిషన్లో ఎవరికి కీపింగ్ బాధ్యతలు ఇవ్వనున్నారనేది కూడా ఇంకా క్లారిటీ రాలేదు. నలుగురు పేసర్లు బరిలోకి దిగితే షమి, సిరాజ్కు తోడు శార్దూల్, ఉమేశ్ ఆడవచ్చు. గిల్, రోహిత్, పుజారా, కోహ్లీ, రహానెలతో బ్యాటింగ్ ఆర్డర్ పటిష్ఠంగానే ఉంది. బౌన్సీ పిచ్ ఉంటుందని క్యూరేటర్ చెబుతున్నాడు. తొలి మూడు రోజులపాటు వరుణుడి నుంచి ఎలాంటి అంతరాయం లేదని అంటున్నారు. కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది.
