Thursday, May 9, 2024

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్.. ప్రాక్టీస్‌ షురూ, వెల్లంగ్టన్‌ వేదికగా రేపు తొలి మ్యాచ్‌

టీ20 ప్రపంచకప్‌లో ఓటమి తర్వాత న్యూజిలాండ్‌తో తలపడేందుకు భారత జట్టు సిద్ధమవుతోంది. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు టీమిండియా సన్నద్ధమవుతోంది. ఇప్పటికే కివీస్‌ గడ్డపై అడుగుపెట్టిన భారత జట్టు ప్రాక్టీస్‌ సెషన్స్‌లో బిజీబిజీగా గడుపుతోంది. బుధవారం ఉదయం వెల్లింగ్టన్‌ స్టేడియంలో జట్టు సభ్యులంతా ప్రాక్టీస్‌ సెషన్‌కు హాజరయ్యారు. ఈ సిరీస్‌ కోసం హార్దిక్‌ పాండ్యా నేతృత్వంలోని జట్టు సన్నాహకాలు ప్రారంభించింది. ఈ సిరీస్‌ కోసం న్యూజిలాండ్‌ పూర్తిస్థాయి జట్టుతో బరిలోకి దిగుతోంది. న్యూజిలాండ్‌ పర్యటనలో భాగంగా టీమిండియా మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌లు ఆడనుంది. న్యూజిలాండ్‌ టూర్‌కు భారత సీనియర్‌ ఆటగాళ్లు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌ దూరమయ్యారు.

దీంతో టీ20 సిరీస్‌కు హార్దిక్‌ పాండ్యా, వన్డే సిరీస్‌కు శిఖర్‌ ధావన్‌ సారథ్యం వహించనున్నారు. మరోవైపు రాహుద్‌ ద్రవిడ్‌కు కూడా విశ్రాంతి ఇవ్వడంతో జాతీయ క్రికెట్‌ అకాడమీ(ఎన్‌సీఏ) డైరెక్టర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ మరోసారి హెడ్‌ కోచ్‌ బాధ్యతలు చేపట్టారు. అదేవిధంగా తొలిసారి భారత టీ20 జట్టులో యువ ఆటగాడు శుభ్‌మన్‌ గిల్‌కు చోటు దక్కింది.

భారత ఓపెనర్లగా గిల్‌, సూర్య
వెల్లింగ్టన్‌ వేదికగా 18న భారత్‌- న్యూజిలాండ్‌ మధ్య తొలి 20 మ్యాచ్‌ జరుగనుంది. ఈ సిరీస్‌కు రెగ్యులర్‌ ఓపెనర్లు రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌ దూరం కావడంతో భారత ఇన్నింగ్స్‌ ఎవరు ప్రారంభిస్తారన్నది అందరి మెదడలను తొలుస్తున్న ప్రశ్న. అయితే టీ20 సిరీస్‌లో ఓపెనర్లుగా శుభ్‌మన్‌ గిల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ను పంపాలని టీమిండియా మేనేజ్‌మెంట్‌ భావిస్తున్నట్లు సమాచారం. శుభ్‌మన్‌ గిల్‌ వన్డేలతోపాటు ఐపీఎల్‌లో కూడా ఓపెనింగ్‌ చేసిన అనుభవం ఉంది. ఇక సూర్య కూడా ఈ ఏడాది వెస్టిండీస్‌ సిరీస్‌లో రోహిత్‌ జోడీగా బరిలోకి దిగాడు. ఓపెనర్‌గా వచ్చిన సూర్య పర్వాలేదనిపించాడు.

- Advertisement -

భారత టీ20 జట్టు ఇదే
హార్దిక్‌ పాండ్యా(కెప్టెన్‌), రిషబ్‌ పంత్‌ (వైస్‌కెప్టెన్‌), ఇసాన్‌ కిషన్‌, శుభ్‌మన్‌ గిల్‌, దీపక్‌ హుడా, సూర్యకుమార్‌ యాదవ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, సంజూ శాంసన్‌, వాషింగ్టన్‌ సుందర్‌, యజ్వేంద్ర చాహల్‌, కుల్దిdప్‌ యాదవ్‌, హర్షల్‌ పటేల్‌, మహ్మద్‌ సిరాజ్‌, భువనేశ్వర్‌ కుమార్‌, అర్షదీప్‌ సింగ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌.

సారథులిద్దరూ రిక్షా సవారీ
టీమిండియా కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా, ఆతిథ్య న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ టీ20 సిరీస్‌ ట్రోఫీని ఆవిష్కరించారు. అనంతరం కేన్‌ విలియమ్స్‌తో కలిసి హార్దిక్‌ పాండ్యా వెల్లింగ్టన్‌ రోడ్ల మీద సరదాగా ముచ్చటిస్తూ రిక్షా సవారీ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ప్రత్యర్థి జట్ల సారథులను ఇలా చూడటం గొప్పగా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు పెట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement