Tuesday, April 30, 2024

ఆడాలనుకున్నా మమ్మల్ని ఆడనివ్వరు.. మహ్మద్‌ రిజ్వాన్‌ కామెంట్స్​

కరాచి: మేం ఆడాలనుకున్నా మమ్మల్ని ఆడనివ్వరు అంటూ పాక్‌ క్రికెటర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్‌- పాకిస్తాన్‌ ఆటగాళ్లు పరస్పరం క్రికెట్‌ ఆడాలని కోరుకుంటున్నారని, కానీ… ఇరు దేశాల మధ్య రాజకీయ సమస్యల కారణంగా అది కుదరడం లేదని రిజ్వాన్‌ అభిప్రాయం వ్యక్తం చేశాడు. మరోవైపు టీమిండియా టెస్టు స్పెషలిస్టు బ్యాట్స్‌మెన్‌ చతేశ్వర్‌ పుజారాపైనా రిజ్వాన్‌ ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుతం పాక్‌ జట్టు వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌ ఆడేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో రిజ్వాన్‌ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇరు జట్ల ఆటగాళ్లు పరస్పరం తలపడాలనుకుంటున్నారని, అయితే… దౌత్యపరమైన విషయాలు క్రికెటర్ల చేతుల్లో లేవని చెప్పుకొచ్చాడు. మరోవైపు టీమిండియా టెస్టు స్పెషలిస్టు బ్యాట్స్‌మెన్‌ చతేశ్వర్‌ పూజారాపై రిజ్వాన్‌ ప్రశంసలు కురిపించాడు. ”ససెక్స్‌ టీమ్‌తో ఆడినప్పుడు పుజారాతో కలిసి ముచ్చటించా. క్రికెట్‌కు సంబంధించిన అనేక విషయాలు చర్చించా. దాంతో అతడి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. ఆటగాళ్లుగా మాది ఒకటే కుటుంబం. మా మధ్య విభేదాలు లేవు. పుజారా చాలా మంచి వ్యక్తి. అతడి ఏకాగ్రత, పట్టుదలంటే నాకెంతో ఇష్టం. తన బ్యాటింగ్‌ను ఆధారిస్తా. బ్యాటింగ్‌ విషయంలో యూనిస్‌ ఖాన్‌, ఫవాద్‌ ఆలమ్‌, పుజారాలకు నేను అత్యుత్తమ రేటింగ్‌ ఇస్తా” అని రిజ్వాన్‌ చెప్పుకొచ్చాడు.

2014 తర్వాత భారత్‌- పాకిస్తాన్‌ ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడలేదు. 2014లో పాకిస్తాన్‌ జట్టు భారత్‌ పర్యటనకు రాగా.. అప్పట్లో రెండు టీ20 మ్యాచ్‌లు, మూడు వన్డేల సిరీస్‌ జరిగింది. ఇక ఆ తర్వాత పాక్‌, ఇండియా మధ్య సిరీస్‌లు జరగలేదు. 2005-06 సీజన్‌లో టీమిండియా చివరిసారిగా పాక్‌లో క్రికెట్‌ మ్యాచ్‌ ఆడింది. ఆ తర్వాత భారత జట్టు పాక్‌ గడ్డమీద అడుగుపెట్టలేదు. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య సంబంధాలు అంత బాగాలేనందున ఇరువైపులా పర్యటనలు జరగడం అసంభవమనే చెప్పాలి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement