మాజీ కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడలిస్టు భారత దిగ్గజ షట్లర్ పారుపల్లి కశ్యప్ తైపీ ఓపెన్ 2022లో అద్భుతంగా రాణిస్తున్నాడు. గురువారంనాడిక్కడ జరిగిన మెన్స్ సింగిల్స్ సెకండ్ రౌండ్లో కశ్యప్ 21-10, 21-19 తేడాతో ప్రత్యర్థి చియా హవో లీ (చైనీస్ తైపీ) పై ఘనవిజయం సాధించాడు. 36 నిముషాలు పాటు సాగిన మ్యాచ్లో ప్రారంభం నుంచి కశ్యప్ ఆధిపత్యం చెలాయించాడు. 2-0 తో విజయం సాధించి, క్వార్టర్స్లోకి దూసుకెళ్లాడు. ఇక ప్రియాన్షు రాజవత్, మిధున్ మంజునాథ్, కిరణ్ జార్జ్ రెండో రౌండ్లోనే పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించారు. రాజవత్ 21-19, 21-13 తేడాతో చెన్ చి టింగ్ చేతిలో పరాజయం పాలుకాగా, మంజునాథ్ 21-5, 21-17 తేడాతో జపాన్ క్రీడాకారుడు కొడాయి నరోకా చేతిలో ఓటమిని చవిచూశాడు. కిరణ్ జార్జ్ తన ప్రత్యర్థి చెన్ టీన్ చావో చేతిలో 21-23, 21-16, 7-21 తేడాతో ఓడిపోయాడు.
ఇక ఉమెన్స్ సింగిల్స్ విభాగంలో సమియా ఇమాద్ ఫరూఖీ 21-18, 21-13 తేడాతో ప్రత్యర్థి వెన్ చి షు (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయింది. దీంతో 5లక్షల డాలర్ల బహుమతిని చేజారిపోయింది. మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్స్లో సిక్త్ సీడ్స్ ఇషాన్ భట్నాగర్- తనీషా క్రాస్టో జోడీ 21-14, 21-17 తేడాతో విజయం సాధించింది. చైనీ తైపీ జంట చెంగ్ కయ్ వెన్ ఆఫ్ వాంగ్ యు ఖియాపై సునాయాసంగా గెలుపొందింది. ఉమెన్స్ డబుల్స్ విభాగంలో తనీషా క్రాస్టో శ్రుతి మిశ్రా జంట ప్రత్యర్థి చైనీస్ తైపీ జోడీ జియా యిన్ లిన్- లిన్ యు-హావో చేతిలో 21-14, 21-8 తేడాతో పరాజయం పాలైంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.