Ind vs Pak T20: ఇవ్వాల ఇండియా-పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ జరుగనున్నది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఈ క్రేజ్ను లైవ్ బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ క్యాష్ చేసుకునే పనిలో పడింది.
‘క్రికెట్ ఆట చాలా దేశాలు ఆడుతుంటాయి.. కానీ, ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్కు ఒక రేంజ్ లో క్రేజ్ ఉంటుందనడంలో సందేహం లేదు.’ ఇదేదో సినిమా డైలాగ్ తీరుగా అనిపించినా.. దాయాది దేశాల మధ్య మ్యాచ్ అంటే దాదాపు వార్ లాంటిదనే చెప్పవచ్చు. అయితే కొన్నేళ్లుగా ఇండియా-పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్లు జరగడం లేదు.
కేవలం ఐసీసీ ఈవెంట్లలో మాత్రమే ఈ రెండు దేశాలు తలపడుతున్నాయి. భారత్-పాక్ జట్లు చివరి సారిగా 2019 వన్డే వరల్డ్ కప్లో తలపడ్డాయి. మాంచెస్టర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో భారత జట్టు 89 పరుగుల తేడాతో విన్ అయ్యింది.
ఆ తర్వాత మళ్లీ ఇరు జట్లు టీ20 వరల్డ్ కప్లో (T20 World Cup)నే తలపడుతున్నాయి. ఈ రోజు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో మ్యాచ్ జరుగనున్నది. ఇరు దేశాలకు చెందిన క్రికెట్ అభిమానులే కాకుండా.. ఎంతో మంది ఈ మ్యాచ్ కోసం ఎంతో ఇంట్రస్ట్గా ఎదురు చూస్తున్నారు.
టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ టికెట్లను ఐసీసీ అక్టోబర్ 4 నుంచి ఆన్లైన్లో అమ్మకానికి పెట్టింది. అయితే ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ టికెట్లు గంటలోపే పూర్తిగా అమ్ముడుపోయాయంటే ఈ మ్యాచ్ క్రేజ్ ఏ లెవల్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇప్పుడు ఈ మ్యాచ్ క్రేజ్ను గ్లోబల్ బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ క్యాష్ చేసుకుంటోంది. ఐసీసీ ఈవెంట్ హక్కులు కలిగిన స్టార్ స్పోర్ట్స్ కొన్నేళ్లుగా అన్ని ఈవెంట్లను లైవ్ టెలీకాస్ట్ చేస్తోంది. టీ20 ప్రసారాలు కూడా అదే బ్రాడ్కాస్ట్ చేస్తోంది. ఇప్పటికే అన్ని మ్యాచ్లకు సరిపడా స్పాన్సర్లను బుక్ చేసింది. వరల్డ్ కప్లో ఒక మ్యాచ్లో 10 సెకెన్ల యాడ్ రేటు రూ.12 లక్షల నుంచి రూ.18 లక్షల వరకు వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది.