Friday, May 3, 2024

వన్డే సిరీస్‌పై భారత్‌ గురి! నేడు భారత్‌ వర్సెస్‌ వెస్టిండీస్‌ రెండో వన్డే..

అహ్మదాబాద్‌: వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌ను ఇంకో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సొంతం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది. సిరీస్‌లోని చారిత్రాత్మక తొలివన్డేను రోహిత్‌సేన గెలుచుకుని 1-0తేడాతో ఆధిక్యంలో ఉంది. బుధవారం రెండోవన్డే అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా మధ్యాహ్నం 1.30కు మొదలవనుంది. తొలి వన్డేకు దూరమైన కేఎల్‌ రాహుల్‌ రెండో వన్డే బరిలో దిగనున్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనకు దూరమైన వైట్‌బాల్‌ కెప్టెన్‌ రోహిత్‌శర్మ తొలి వన్డేలో హాఫ్‌సెంచరీతో కీలక ఇన్నింగ్స్‌ ఆడి జట్టును విజయపథంలో నడిపించాడు. నేటి మ్యాచ్‌కు వైస్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌కూడా అందుబాటులో ఉండటంతో భారత్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. మరోవైపు రెండో వన్డేను గెలుచుకోవడం ద్వారా సిరీస్‌ ఆశలు సజీవంగా ఉంచుకోవాలని విండీస్‌ భావిస్తోంది.

రోహిత్‌, కేఎల్‌ రాహుల్‌ టీమిండియా ఇన్నింగ్స్‌ ప్రారంభిస్తే విరాట్‌కోహ్లీ, సూర్యకుమార్‌, రిషభ్‌పంత్‌తో కూడిన భారత్‌ బ్యాటింగ్‌ బలంగా ఉంది. తొలివన్డేలో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ప్రధానంగా స్పిన్నర్లు విండీస్‌ బ్యాటర్లును కట్టడి చేశారు. చాహల్‌ 4వికెట్లు, వాషింగ్టన్‌ సుందర్‌ 3వికెట్లుతో సత్తా చాటారు. వీరిద్దరూ మెరుగైన ప్రదర్శనతో రాణించడంతో కుల్దీప్‌ యాదవ్‌ రిజర్వ్‌ బెంచ్‌కే పరిమితం కానున్నాడు. శిఖర్‌ ధావన్‌, శ్రేయస్‌ అయ్యర్‌ కూడా ఆడేది సందేహమే. విండీస్‌ జట్టును బ్యాటింగ్‌ వైఫల్యం వెంటాడుతుంది. గత 16వన్డేల్లో వెస్టిండీస్‌ పదిసార్లు ఆలౌటైంది. 50 ఓవర్లపాటు బ్యాటర్లు క్రీజులో నిలవలేకపోవడం విండీస్‌జట్టు బ్యాటింగ్‌ లోపాలను బహిర్గతం చేస్తోంది.

భారత్‌ అంచనా జట్టు: రోహిత్‌శర్మ (కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, విరాట్‌కోహ్లీ, రిషభ్‌పంత్‌ (వికెట్‌కీపర్‌), సూర్యకుమార్‌ యాదవ్‌, దీపక్‌ హుడా, వాషింగ్టన్‌ సుందర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, సిరాజ్‌, చాహల్‌, ప్రసిధ్‌ కృష్ణ.
వెస్టిండీస్‌ జట్టు: బ్రాండన్‌ కింగ్‌, షాయ్‌హోప్‌, బ్రావో, బ్రూక్స్‌, నికోలస్‌ పూరన్‌, పొలార్డ్‌ (కెప్టెన్‌), జాసన్‌ హోల్డర్‌, ఫాబియెన్‌ అలెన్‌, అకీల్‌ హోసెయిన్‌, అల్జారీ జోసెఫ్‌, కీమర్‌రోచ్‌.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement