Tuesday, April 23, 2024

ధావన్‌, అయ్యర్‌కు కరోనా నెగెటివ్‌.. నెట్ ప్రాక్టీస్ లో ప్లేయ‌ర్లు..

వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు ముందు కరోనా బారిన పడిన టీమిండియా స్టార్‌ బ్యాటర్లు శిఖర్‌ ధావన్‌, శ్రేయస్‌ అయ్యర్‌ కోలుకున్నారు. కరోనా నిర్ధారణ పరీక్షల్లో వీరికి నెగెటివ్‌గా తేలింది. దీంతో వీరు నెట్‌ ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గొన్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ వర్గాలు ధ్రువీకరించాయి. పేసర్‌ నవదీప్‌ సైనీ కూడా కోలుకుని సోమవారమే నెట్‌ ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. అయితే నేడు విండీస్‌తో జరగనున్న రెండో వన్డేకు వీరు దూరంగా ఉండనున్నారని సమాచారం. అయితే కరోనా బారిన పడిన రుతురాజ్‌ గైక్వాడ్‌ మాత్రం ఇంకా ఐసోలేషన్‌లో ఉన్నాడు. రుతురాజ్‌ వన్డే సిరీస్‌ ఆడేది సందేహంగా మారింది.

కాగా వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు ముందు శిఖర్‌ ధావన్‌, రుతురాజ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, నవదీప్‌ సైనీ కరోనా బారినపడ్డారు. ఈ నేపథ్యంలో ఇషాన్‌కిషన్‌, షారుక్‌ఖాన్‌, మయాంక్‌ అగర్వాల్‌ జట్టులో చేరారు. క్వారంటైన్‌ గడువు ముగించుకున్న మయాంక్‌ సోమవారం ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గొన్నాడు. మరోవైపు తొలి వన్డేకు వ్యక్తిగత కారణాలతో దూరమైన కేఎల్‌ రాహుల్‌ కూడా అహ్మదాబాద్‌లో ఉన్న జట్టులో చేరి ప్రాక్టీస్‌ ప్రారంభించాడు. సోమవారం భారత శిబిరంలో రాహుల్‌, మయాంక్‌, సైనీ చేరారని బీసీసీఐ ట్విటర్‌ వేదికగా వెల్లడించింది. నెట్స్‌లో వారు ప్రాక్టీస్‌ చేస్తున్న ఫొటోలను అభిమానులకు బీసీసీఐ షేర్‌ చేసింది. ముగ్గురూ ప్రాక్టీస్‌ సెషన్‌లో చెమటోడ్చారని క్యాప్షన్‌ ఇచ్చింది. కరోనా బారినపడిన నవదీప్‌ సైనీ తిరిగి నెట్స్‌లో బౌలింగ్‌ ప్రారంభించాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement