Thursday, May 2, 2024

తడిసి మొలకలు వ‌స్తున్న వ‌డ్లు.. మిల్లుల ద‌గ్గ‌ర ఆరుబ‌య‌టే వ‌డ్ల బ‌స్తాలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఈ నెల మొదటి వారం నుంచి సీఎంఆర్‌ (కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌) బియ్యం సేకరణను ఎఫ్‌సీఐ నిలపివేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా రైసు మిల్ల్లుల్లో ఆరుబటయ భారీ ఎత్తున ధాన్యం నిల్వ లు పేరుకుపోయాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఆ ధాన్యం మొలకలొస్తుండడంతో రైసు మిల్లర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరిస్థితి కనీసం మరో వారం పాటు ఇలానే కొనసాగినా తాము కోట్లలో నష్టం ఎదుర్కొక తప్పదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎఫ్‌సీఐ సాఫీగా బియ్యం సేకరణను కొనసాగిస్తే… రైసు మిల్లర్లు దాన్యాన్ని మిల్లింగ్‌ చేసి ఎప్పటికప్పుడు ఎఫ్‌సీఐకి అందజేసేవారు. మిల్లింగ్‌లో భాగంగా ముందుగా మిల్లు ఆవరణలో ఆరుబయట నిల్వ చేసిన ధాన్యాన్ని లాట్లను ముందుగా మరాడించేవారు. అయితే బియ్యం సేకరణను ఎఫ్‌సీఐ నిలిపివేయ డంతో ఆరుబటయ వేసిన ధాన్యం లాట్లు వర్షాలకు తడిసి మొలకలు వస్తున్నాయని మిల్లర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది యాసంగిలో రైతుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 50.10లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఈ ధాన్యాన్ని రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉన్న 3200 మిల్లులకు తరలించింది.

నిబంధనల ప్రకారం కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లుకు వచ్చిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఎఫ్‌సీఐకి అప్పగించే వరకు ధాన్యం పాడవకుండా చూడాల్సిన బాధ్యత మిల్లర్లదే. ధాన్యం నాణ్యత చెడి పోయి నా, తడిసి మొలకెత్తినా ఆ నష్టాన్ని మిల్లర్లే భరించాల్సి ఉం టుంది. మరొ వైపు ఈ ఏడాది సేకరిం చిన ధాన్యం తోపాటు గత వానాకాలం (ఖరీఫ్‌)లో సేకరించిన ధాన్యం కూడా దాదాపు 40లక్షల మెట్రిక్‌ టన్నుల దాకా మిల్లు ల్లో నిల్వ ఉంది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని రైసు మిల్లుల్లో ఆరుబయట ఉన్న 40లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం తడిసి ముద్దవుతోంది. ధాన్యం మొలకలు వస్తే మిల్లింగ్‌ చేసి బియ్యం గా మార్చడం అసాధ్యమని, ఆ నష్టాన్నంతా రైసు మిల్లులు భరించాల్సి వస్తోందని తెలంగాణ రాష్ట్ర రైసు మిల్లర్ల అసోసియేషన్‌ అధ్యక్షుడు గంప నాగేంద్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఎఫ్‌సీఐ (కేంద్ర ప్రభుత్వం), రాష్ట్ర ప్రభుత్వం ఒక సయోధ్యకు వచ్చి బియ్యం సేకరణను పునరుద్దరించాలని కోరుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement