Wednesday, May 15, 2024

నడిరోడ్డుపై డాక్టర్ దంపతుల దారుణహత్య

రాజస్థాన్‌లోని జైపూర్‌లో పట్టపగలే డాక్టర్ దంపతులను హత్య చేసిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. భరత్​పూర్​ జిల్లా హెడ్​క్వార్టర్స్​లోని సెంట్రల్​ బస్టాండ్​ సర్కిల్​ వద్ద బైకుపై వచ్చిన ఇద్దరు నిందితులు ఓ కారును అడ్డగించారు. ఆ కారులోని దంపతులపై ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ ఘటనలో కారులోని జంట అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు డాక్టర్లు అని.. వారిని సుదీప్ గుప్తా, సీమా గుప్తాలుగా పోలీసులు గుర్తించారు.

అయితే ఈ హత్యలను ప్రతీకార హత్యలుగా రాజస్థాన్ పోలీసులు భావిస్తున్నారు. బైక్‌పై వచ్చిన నిందితులు అనూజ్, మహేష్‌ అని వారి విచారణలో తేలింది. వారి వివరాల ప్రకారం.. డాక్టర్​ సుదీప్​కు గతంలో ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. కొన్నేళ్లు గడిచిన తర్వాత ఆ మహిళ, ఆమె ఐదేళ్ల బిడ్డ ఉన్న ఇంటికి నిప్పంటుకుని ప్రమాదవశాత్తూ వారు చనిపోయారు. అయితే అది ప్రమాదం కాదని, సుదీప్​ కుటుంబమే ఆ దాష్టీకానికి పాల్పడిందని కేసు నమోదైంది. దీంతో 2019లో సుదీప్​, అతడి తల్లి, భార్య సీమా జైలు శిక్ష అనుభవించి ఇటీవలే విడుదలయ్యారు. ఈ కేసులో బాధితురాలి సోదరుడే ఇప్పుడు నిందితుల్లో ఒకడైన అనుజ్ అని పోలీసులు తెలిపారు. దీంతో ప్రతీకారంగానే అనూజ్ మరో వ్యక్తితో కలిసి హత్యలకు పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. కాగా ఈ హత్యలకు సంబంధించిన వీడియోను బీజేపీ నేత రాజ్యవర్థన్​సింగ్​ రాథోడ్​ తన ట్విట్టర్​లో పోస్ట్​ చేసి.. కాంగ్రెస్​ పాలనలో నేరగాళ్లు విజృంభిస్తున్నారని ఆక్షేపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement