Tuesday, May 14, 2024

Delhi | వైరా సీటు విధేయులకే ఇవ్వాలి.. ఓయూ జేఏసీ నేత అర్జున్ డిమాండ్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఖమ్మం జిల్లాలో వైరా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ పార్టీ విధేయులకే ఇవ్వాలని అక్కడి నేతలు డిమాండ్ చేస్తున్నారు. పార్టీలు మారి వచ్చినవారికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఆది నుంచి పార్టీ కోసం కష్టపడ్డవారికే సీటు కేటాయించాలని ఓయూ జేఏసీ నేత బానోత్ అర్జున్ బాబు అన్నారు. సోమవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఈ స్థానం నుంచి టికెట్ ఆశిస్తూ దరఖాస్తు చేసుకున్నానని, 2018లో కూడా ప్రయత్నించినప్పటికీ టికెట్ కేటాయించలేదని తెలిపారు.

ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా జరిగిన తెలంగాణ ఉద్యమంతో పాటు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సహా అనేక ఉద్యమాల్లో పాల్గొన్నానని చెప్పారు. వైరా టికెట్ ఎవరికి కేటాయించాలన్నది అధిష్టానం నిర్ణయమే అయినప్పటికీ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన విధేయులకే ఇవ్వాలని తాను అధిష్టానం పెద్దలను కోరినట్టు చెప్పారు. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు.

మరోవైపు బంజారా సామాజికవర్గాన్ని గందరగోళానికి గురి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, కొందరు తెలంగాణ సీఎం కేసీఆర్ ఇచ్చే ప్యాకేజి కోసం అమ్ముడుపోయి పార్టీని ఓడించే ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. టికెట్ రాని నేతలు పార్టీపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, బంజారాలు అయోమయానికి గురికాకుండా కాంగ్రెస్‌కు ఓటేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ ఎన్నికల్లోనైనా తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని అన్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement