Sunday, April 28, 2024

Hit and Run – వందే భార‌త్ ఢీ … ఇద్ద‌రు కుమార్తెల‌తో స‌హా ముగ్గురు దుర్మ‌ర‌ణం

మీరట్‌: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. లాగుడు బండిపై వెళ్తున్న ఓ కుటుంబాన్ని వేగంగా దూసుకొచ్చిన వందే భారత్‌ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ, ఆమె ఇద్దరు కుమార్తెలు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. తన భార్యాబిడ్డలను బండిపై లాక్కెళ్తున్న వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. మీరట్‌ సమీపంలోని కసమ్‌పూర్‌లో మానవసహిత రైల్వే లెవల్‌ క్రాసింగ్‌ దగ్గర ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. కన్‌కర్‌ఖేరా ప్రాంతానికి చెందిన నరేష్‌ అనే వ్యక్తి భార్య మోనా (40), కుమార్తెలు మనీషా (14), చారూ (7) లను తన లాగుడు బండిపై కూర్చోబెట్టుకుని పనిమీద బయటికి వచ్చాడు. కసమ్‌పూర్‌ రైల్వే లెవల్‌ క్రాసింగ్‌ దగ్గర గేటు మూసి ఉండటంతో నరేష్‌ ఆ గేటు కింద నుంచి ఈగి.. తన బండిని పట్టాలు దాటించే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో సెమీ హైస్పీడ్‌ వందే భారత్‌ రైలు దూసుకొచ్చి బలంగా ఢీకొట్టింది. దాంతో లాగుడు బండి ఎగిరిపోయి తునాతునకలు అయ్యింది. ఆ బండిలో ఉన్న మోనా, మనీషా, చారూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. అయితే, అప్పటికే బండిని లాగుతూ ట్రాక్‌ను దాటిన నరేష్‌ ప్రాణాలతో బయటపడ్డాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement