Friday, May 10, 2024

రాష్ట్రపతి ఎన్నికల్లో ఏకగ్రీవమే సముచితం.. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా

దేశ అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి ఏకగ్రీవంగా ఎన్నుకోవడమే సముచితమని, గౌరవప్రదమని మాజీ కేంద్రమంత్రి, రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా అభిప్రాయపడ్డారు. ఎన్డీయే అభ్యర్థిగా గిరిజన తెగలకు చెందిన మహిళ ద్రౌపది ముర్మును ప్రకటించండంపై ఇటీవల పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇటీవల స్పందిస్తూ ఆమెను బరిలోకి దింపుతున్న విషయం ముందే చెబితే విపక్షాలు చర్చించి సమర్థించే అవకాశం ఉండేదని అన్నారు. మహారాష్ట్రంలో బీజేపీ మద్దతుతో శివసేన తిరుగుబాటు చేసిన ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో ద్రౌపది విజయావకాశాలు మెరుగుపడ్డాయని అన్నారు. మమత వ్యాఖ్యలతో విపక్షాల్లో భిన్నాభిప్రాయలు, విమర్శలు వ్యక్తమైనాయి.

తృణమూల్‌ అధినేత్రి మమత స్వయంగా సిన్హా పేరును ప్రతిపాదించారని, ఇప్పుడు ద్రౌపది ముర్ము విషయంలో కాస్త సానుకూలంగా మాట్లాడడమేమిటన్న విమర్శలు వచ్చాయి. అయితే, సిన్హా మాత్రం మమత వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని సమర్థించారు. నిజంగానే ద్రౌపది ముర్ము పేరు ముందే ప్రకటించి, సహకరించాలని కోరి ఉంటే ఆమెనే ఏకగ్రీవంగా ఎన్నుకునేవారేమోనని అన్నారు. ఉన్నత రాజ్యాంగ పదవి (రాష్ట్రపతి)కి ఎన్నికలు జరగడం మంచిది కాదని, ఏకగ్రీవంగానే నియమించడం సముచితమన్న ఆయన ఇప్పుడు ఎన్నికలు జరగడానికి బీజేపీ వైఖరే కారణమని అభిప్రాయపడ్డారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మమతా బెనర్జీ వ్యాఖ్యలను తాను సమర్ధిస్తున్నానని స్పష్టం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement