Thursday, April 25, 2024

National : గంట‌సేపు లైట్లు ఆపేద్దాం..నేడు ఎర్త్ అవ‌ర్!

ఎర్త్ అవర్ అనేది వాతావరణ మార్పులపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నిర్వహించే కార్యక్రమం. వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఎప్పటిలాగే, ఈ సంవత్సరం కూడా నేటి రాత్రి 8:30 నుండి 9:30 గంటల వరకు ఎర్త్ అవర్ పాటించాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు.

- Advertisement -

ఎర్త్ అవర్ 2024 సందర్భంగా ఆ సమయంలో, ప్రజలు, సంస్థలు ఒక గంట పాటు లైట్లు, ఎలక్ట్రికల్ ఉపకరణాలను ఆపివేయమని కోరింది. భూమి పట్ల నిబద్ధతకు చిహ్నంగా ఒక గంట పాటు. రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి ఒక గంట పాటు లైట్లు ఆర్పాలని ఇప్పటికే చాలా స్వచ్ఛంద సంస్థలు పిలుపునిచ్చాయి.

ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు చ‌ర్య‌లు
వాతావరణ మార్పులపై అవగాహన కల్పించడంతోపాటు పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోవడం ఈ కార్యక్రమం అసలు లక్ష్యం. కాగా.. 2007లో, సింబాలిక్ లైట్స్ అవుట్ ఈవెంట్ ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ప్రారంభమైంది. ఇక అప్పటి నుంచి 190కి పైగా దేశాల్లో ఈ కార్యక్రమం ఫాలో అవుతూ.. గ్లోబల్ ఉద్యమంగా మారింది. ఈ క్రమంలోనే.. హైదరాబాద్‌లోనూ ఈ కార్యక్రమాన్ని అనుసరిస్తోంది.

రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్‌లోనూ
ఈ ఎర్త్‌ అవర్‌ సందర్భంగా నగరంలోని ఐకానిక్‌ భవనాలన్నీ చీకటిగా మారనున్నాయి. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం, తెలంగాణ రాష్ట్ర సచివాలయం, దుర్గం లేక్ కేబుల్ వంతెన, హుస్సేన్ సాగర్ వద్ద బుద్ధ విగ్రహం, గోల్కొండ కోట, తెలంగాణ రాష్ట్ర కేంద్ర గ్రంథాలయం, చార్మినార్… అంధకారంలో మునిగిపోనున్నాయి. ఈ భవనాల్లోని లైట్లు గంటపాటు స్విచ్ ఆఫ్ చేసి ఎర్త్ అవర్ లో పాల్గొంటారు. మరోవైపు.. పలువురు నగరవాసులు కూడా ఈ ఎర్త్‌ అవర్‌లో పాల్గొని.. తమ ఇళ్లలోని లైట్లు, విద్యుత్‌ ఉపకరణాలను ఆర్పివేసి తమ మద్దతు తెలప‌నున్నారు. దీంతో… ఆ గంటపాటు నగరమంతా అంధకారంగా మారనుంది.
దేశ వ్యాప్తంగా ప‌లు సిటీస్‌లో..
హైదరాబాద్ నగరంతో పాటు దేశ రాజధాని ఢిల్లీలో నేడు ఎర్త్ అవర్ పాటించనున్నారు. ఢిల్లీలోనూ.. ఈ ఎర్త్ అవర్ కార్యక్రమంలో పలువురు పాల్గొని.. తమ బాధ్యతను నిర్వర్తించనున్నారు. గతేడాది.. ఢిల్లీలో 279 మెగా వాట్ల విద్యుత్ ఆదా అయిందని అధికారులు ప్రకటించారు. భారతదేశంతో పాటు, లాస్ ఏంజిల్స్, హాంకాంగ్, సిడ్నీ, రోమ్, మనీలా, సింగపూర్, దుబాయ్‌లలో ఈ ఎర్త్ అవర్‌ను పాటిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement