Sunday, April 28, 2024

TS ఏపీ త‌ర‌హాలో జాబ్స్ ఇవ్వాలి – 2008 డీఎస్సీ అభ్య‌ర్థుల డిమాండ్‌


ఉద్యోగాలపై ఫోక‌స్‌పెట్టిన ప్ర‌భుత్వం
15 ఏళ్లుగా పోరాడుతున్న 2008 డీఎస్సీ అభ్యర్థులు
గ‌తంలోనే తెలంగాణ హైకోర్టు ఆదేశాలు
స‌ర్కారు సానుకూలంగా ఉన్నా.. ఆల‌స్యం కానుందా

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు 2008 డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం సానుకూల నిర్ణయంతోనే ఉన్నప్పటికీ ఉద్యోగాల అంశం మాత్రం కాస్త ఆలస్యమయ్యేట్లు కనబడుతోంది. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా 2008 డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలని ఇటీవల సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రికి ప్రభుత్వ సలహాదారులు హర్కర వేనుగోపాల్‌ రావు లేఖ రాశారు. ఈ క్రమంలోనే వీరికి ఉద్యోగాలిచ్చే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. 2008లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్‌ 6వ తేదీన 35 వేల పోస్టులలో మెగా డీఎస్సీని ప్రకటించింది. ఎస్జీటీ- పోస్టులను కామన్‌ మెరిట్‌ ప్రకారం భర్తీ చేస్తామని, బీఈడీ, డీఈడీ అభ్యర్థులు అర్హులని ప్రకటించింది.

ఆ జీవోతో తీవ్ర న‌ష్టం..

సుమారు 50 రోజుల తర్వాత ఎస్జీటీ- పోస్టుల్లో 30 శాతం డీఈడీ అభ్యర్థులకు కేటాయిస్తూ 2009 జనవరి 29వ తేదీన జీవో నంబర్‌ 28ను తీసుకొచ్చింది. దీంతో బీఈడీ అభ్యర్థులు కోర్టుకు వెళ్లగా కామన్‌ మెరిట్‌ ప్రకారం భర్తీ చేయాలని కోర్టు అప్పట్లో తీర్పు ఇచ్చింది. ప్రభుత్వం నియమించిన కేబినెట్‌ సబ్‌ కమిటీ- కూడా కామన్‌ మెరిట్‌ ప్రకారం భర్తీ చేయాలని సూచించింది. దీంతో నోటిఫికేషన్‌ ప్రకారమే ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం 2010 జూన్‌ 21న జీవో 27ను విడుదల చేసింది. దీని ప్రకారం అధికారులు నియామక కౌన్సిలింగ్‌ ప్రక్రియ ప్రారంభించారు. జిల్లాల వారీగా కామన్‌ మెరిట్‌ ప్రకారం ఎంపి-కై-న అభ్యర్థుల జాబితాను అధికారులు ప్రకటించారు.

ట్రిబ్యున‌ల్‌కు వెళ్లిన డీఈడీ అభ్య‌ర్థులు

- Advertisement -

దీంతో డీఈడీ అభ్యర్థులు పరిపాలన ట్రిబ్యునల్‌ను ఆశ్రయించగా.. జూన్‌ 28న కౌన్సిలింగ్‌పై స్టే విధించింది. జీవో 28 ప్రకారం 30 శాతం కోటా కల్పిస్తూ కౌన్సిలింగ్‌ నిర్వహించాలని ట్రిబ్యునల్‌ ఆదేశించింది. దీంతో అధికారులు కౌన్సిలింగ్‌ నిలిపివేశారు. ఆ తర్వాత 30 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ కొత్త మెరిట్‌ లిస్టు విడుదల చేసి 2010లో ఉద్యోగాలు ఇచ్చారు. దీంతో మంచి మార్కులు సాధించినా.. ఉద్యోగం రాక ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు 3500 మంది బీఈడి అభ్యర్థులు నష్టపోయామంటున్నారు. తమ కలలు కుప్పకూలిపోయాయని ఆవేదన చెందుతున్నారు.

15 ఏండ్లుగా ఎడ‌తెగ‌ని పోరాటం..

ఇందులో తెలంగాణ అభ్యర్థులు 1200 మంది వరకు ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 15 ఏళ్లుగా తమకు న్యాయం చేయాలని వారు ప్రభుత్వం చుట్టూ.. కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ధర్నాలు, రాస్తా రోకోలు, నిరాహార దీక్షలు.. ఇలా అన్ని ప్రయత్నాలు చేశారు. తమకు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలని డీఎస్సీ 2008 బాధిత అభ్యర్థులు ఇటీవల తమ సమస్యను ప్రజాభవన్‌ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. 2008 డీఎస్సీలో నష్టపోయిన మెరిట్‌ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని గత నెల 8న రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వానికి సూచించిందని 2008 డీఎస్సీ అభ్యర్థుల సంఘం నాయకులు ఉమామహేశ్వర్‌ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లోపే 30వేల ఉద్యోగ నియామక పత్రాలు అందజేసి నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపిన కాంగ్రెస్‌ ప్రభుత్వం… తమ 15 ఏళ్ల కన్నీళ్లుతుడవాలని కోరుతున్నారు.

ఏపీలో ఇలా..

ఏపీలో దాదాపు రెండున్నర సంవత్సరాల క్రితమే డీఎస్సీ 2008 బాధితులకు మినిమం టైమ్‌ స్కేల్‌ ప్రాతిపదికన కాంట్రాక్ట్‌ పద్ధతిలో ఉద్యోగాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఒకే నోటిఫికేషన్‌లో బాధితులు ఒక రాష్ట్రంలో ఉద్యోగాల్లో ఉండడం, మరోక రాష్ట్రంలో న్యాయం కోసం ఎదురుచూడడం సరికాదని గతంలో రాష్ట్ర హైకోర్టు వ్యాఖ్యానించింది. డీఎస్సీ 2008 బాధితుల పట్ల సానుకూల నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఖాళీల్లో వారిని భర్తీ చేయండి లేదా.. నష్టపోయిన బీఎడ్‌ అభ్యర్థులకు ఏపీలో మాదిరిగా కనీసం కాంట్రాక్ట్‌ పద్దతిలో అయినా ఉద్యోగాలు ఇవ్వండంటూ గత నెలలో ఆదేశించింది. ఈక్రమంలోనే కోర్టు ఆదేశాలకు అనుగుణంగా వారికి ఉద్యోగాలిచ్చే అంశాన్ని పరిశీలిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement