Saturday, April 27, 2024

మునుగోడులో ముమ్మాటికి టీఆర్‌ఎస్‌దే గెలుపు : మంత్రి హ‌రీష్ రావు

మునుగోడు ప్రజలకు అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాయని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వల్ల నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు చేరుతున్నాయ‌ని మంత్రి హ‌రీష్ రావు అన్నారు. ఎనిమిదేండ్లలో ఏం చేశామో తాము చూపిస్తామని, మరి బీజేపీ ఏం చేసిందో చెప్పే దమ్ముందా అని ప్రశ్నించారు. గ్యాస్‌ పెట్రోల్‌ ధరలు పెంచిన ఘనత బీజేపీదేనని విమర్శించారు. బీజేపీ అంటే పెంచుడు.. టీఆర్‌ఎస్‌ అంటే పంచుడని మంత్రి చెప్పారు. కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌ స్థాయి ఏంటో ఢిల్లీ దూతలే చెప్పారని, ఇద్దరు నేతలవి నకిలీ మాటలు, వెకిలి చేష్టలని విమర్శించారు. మునుగోడు నియోజకవర్గంలో చరిత్ర సృష్టించే విధంగా సభ నిర్వహించామన్నారు. సీఎం కేసీఆర్‌ సభ ప్రజాభిమానాన్ని చాటిచెప్పిందన్నారు. మునుగోడులో గెలుపు ముమ్మాటికీ ఖాయమైందని చెప్పారు. దశాబ్దాల ఫ్లోరైడ్‌ భూతాన్ని తరిమికొట్టిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని వెల్లడించారు. పార్టీలో చేరికల గురించి బీజేపీ మాట్లాడటం అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టేనని ఎద్దేవా చేశారు. వందల కోట్లు ఆశ చూపి తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అయినా బీజేపీ ఎత్తుగడలను ఎమ్మెల్యేలు తిప్పికొట్టారని చెప్పారు. మీరు విలీనం చేసుకోవచ్చుకానీ తాము అదేపని చేస్తే తప్పా అని నిలదీశారు. ఇతర పార్టీల ఎంపీలను బీజేపీలో చేర్చుకుంటే తప్పులేదా అని ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement