Friday, May 3, 2024

పాక్‌ జైళ్ళలో ముగ్గురు ఆంధ్రా జాలర్లు.. దౌత్య ప‌రంగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్న కేంద్రం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు జాలర్లు ప్రస్తుతం పాకిస్తాన్‌ జైళ్ళలో బందీలుగా ఉన్నారని విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్‌ తెలిపారు. పాకిస్తాన్‌తో సహా వివిధ దేశాలలో బందీలుగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జాలర్ల విడుదల, వారిని క్షేమంగా భారత్‌కు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేమిటని రాజ్యసభలో గురువారం వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు జాలర్లు మాత్రమే ప్రస్తుతం పాకిస్తాన్‌లోని వివిధ జైళ్ళలో బందీలుగా ఉన్నారని చెప్పారు. అనేక దేశాలలో అమలులో ఉన్న కఠిన రహస్య చట్టాల కారణంగా తమ వద్ద బందీలుగా ఉన్నవారి అనుమతి లేకుండా ఖైదీల వివరాలను వెల్లడించడానికి స్థానిక అధికారులు విముఖత చూపుతుంటారు. బందీల వివరాలు వెల్లడించే దేశాలు సైతం తమ వద్ద జైళ్ళలో ఉన్న విదేశీయులకు సంబంధించిన సమాచారం ఇవ్వడానికి ముందుకురావని మంత్రి చెప్పారు.

విదేశాల్లో జైళ్ళలో నిర్బంధంలో ఉన్న జాలర్ల భద్రత, రక్షణ, బాగోగులు చూసుకోవడం వంటి విషయాలకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని మంత్రి తెలిపారు. వలస చట్టాల ఉల్లంఘన ఆరోపణలపై వివిధ విదేశీ జైళ్ళలో నిర్బంధంలో ఉన్న భారతీయ జాలర్లకు ఆయా దేశాల్లోని భారతీయ దౌత్య కార్యాలయాలు అన్ని విధాలా సహాయ సహకారాలను అందిస్తుంది. నిర్బంధంలో ఉన్న జాలర్లు భారతీయులని నిర్ధారించుకున్న తర్వాత వారి విడుదలకు దౌత్యపరంగా అవసరమైన చర్యలు తీసుకోవడంతోపాటు విడుదల అనంతరం వారిని సురక్షితంగా భారత్‌కు తీసుకురావడంలో దౌత్య కార్యాలయాలు నిర్విరామంగా పని చేస్తుంటాయని మంత్రి వెల్లడించారు. జైళ్ళలో బందీలుగా ఉన్న భారతీయ జాలర్లను ఆయా దేశాల్లోని భారతీయ దౌత్య కార్యాలయాల అధికారులు తరచుగా డిటెన్షన్‌ సెంటర్లను సందర్శిస్తూ వారికి అవసరమైన న్యాయపరమైన సహాయాన్ని అందిస్తాయని మురళీధరన్‌ చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement