Friday, April 26, 2024

దంచికొట్టిన వాన..! నీటమునిగిన కాలనీలు.. రంగంలోకి జీహెచ్‌ఎంసీ..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : అకస్మాత్తుగా కురిసిన వర్షంతో హైదరాబాద్‌ తడిసిముద్దయింది. ఈ రోజు (ఆదివారం) సాయంత్రం నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టడంతో ట్రాఫిక్‌ ఎక్కడికక్కడే స్తంబించి పోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం 5 గంటల వరకు బాగా ఎండకాచింది. ఆరు గంటల తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయి భారీ వర్షం కురిసింది. ఖైరతాబాద్‌ పంజాగుట్ట, లకిడీకపూల్‌, అమీర్‌పేట్‌, ముషీరాబాద్‌, చిక్కడపల్లి, రాంనగర్‌, మియాపూర్‌, కూకట్‌పల్లి, బంజారాహిల్స్‌, ఉప్పల్‌, బేగంపేట తదితర ప్రాంతాల్లో ఒక్కసారిగా భారీగా వర్షం కురవడంతో వాహనదారులు తడిసి ముద్దయ్యారు.

పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. గత కొన్ని రోజులుగా కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు ఇంకా ముంపులోనే ఉండగా… ఆదివారం మరోసారి కురిసి వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు చోట్ల రోడ్లపైకి వర్షం నీరు వచ్చి చేరడంతో వాహనదారులు ఇక్కట్లకు లోనయ్యారు. జీహెచ్‌ఎంసీ సహాయక బృందాలు రంగంలోకి దిగి రహదారులపై చేరిన వర్షపునీటిని తొలగించారు. బేగంపేట నుంచి సికింద్రాబాద్‌ వరకు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. వరద నీటిలో వాహనాలు నెమ్మదిగా కదులుతుండడం కూడా ట్రాఫిక్‌ సమస్యకు కారణమైంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement