Saturday, April 27, 2024

స్థిరాస్తి ధరల్లో అస్థిరత.. సామాన్యుడికి అందనంత ఎత్తుకు సొంతింటి కల

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : గత కొన్ని నెలలుగా హైదరాబాద్‌ మహానగరం చుట్టూ అంతుచిక్కని విధంగా విస్తరించిన స్థిరాస్తి ధరల్లో అస్థిరత నెలకొంది. అన్ని రంగాల్లో ఆర్థిక సుస్థిరత సాధిస్తున్న తెలంగాణ రాజధాని ఇప్పుడు అత్యంత ఖరీదైన నగరంగా మారిపోతోంది. ఇదివరకు దేశంలోనే ‘బెస్ట్‌ లివింగ్‌ సిటీ’గా పేరు తెచ్చుకున్న హైదరాబాద్‌లో కాలక్రమేనా ఇంటి అద్దెలు కూడా అదుపుతప్పిపోయాయి. ఈ క్రమంలో సొంతింటి కల సాకారం చేసుకునేందుకు ఎంత అన్వేషించినా మార్గాలు కనిపించడం లేదు. ముడిసరుకు ధరల పెరుగుదల పేరుతో ఏడాదికి రెండు మూడు పర్యాయాలు స్థిరాస్తి ధరలను అమాంతంగా పెంచేస్తున్నాయి రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు. ఎంచుకున్న ప్రాంతాన్ని, వసతి సైకర్యాలను, నిన్మాణ శైలిని బట్టి ఒక్కో చదరపు అడుగు ధర రూ.6వేల నుంచి రూ.12 వేల వరకు నిర్ణయిస్తున్నారు.

ఈ ధరలపై ప్రభుత్వపరంగా ఎలాంటి పర్యవేక్షణ లేకపోవడం, నగరం చుట్టూ విల్లా కల్చర్‌ పెరిగిపోవడం లాంటివి గృహ నిర్మాణ సంస్థలకు కలిసివస్తున్నాయి. ఇళ్ళులేని పేద వర్గాల సొంతింటి కల నెరవేర్చేందుకు తెలంగాణ సర్కారు ప్రణాళికాబద్ధంగా చర్యలు ప్రారంభించింది. కానీ.. ప్రైవేటు రంగంలో చిన్నపాటి ఉద్యోగాలు చేసుకునేవారు, చిన్నచిన్న వ్యాపారాలతో జీవనం సాగించేవారు, వృత్తి రీత్యా రాజధాని మహాగనరం చుట్టూ తాత్కాలికంగా స్థిరపడిన లక్షలాది కుటుంబాలు తమ సొంతింటి కలను సాకారం చేసేకునేందుకు మార్గమెక్కడా కనిపించడం లేదు.

ప్రైవేట్‌ రంగంలో గృహ నిర్మాణ సంస్థలు అందుబాటులోకి తీసుకువస్తున్న ఇళ్ళ స్వరూపం మెరుగైన జీవన శైలికి అత్యంత అనుకూలంగా ఉంటున్నప్పటికీ, ధరలు మాత్రం సామాన్యుడికి అందనంత ఎత్తుకు పెరిగిపోతున్నాయి. సొంతింటి కల నెరవేర్చుకునే క్రమంలో బ్యాంకు రుణాలపైనే ఆధారపడిన కుటుంబాలు సాధారణంగా 80శాతానికి పైబడే ఉంటాయి. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం మొదలుకుని ధరలు పైపైకి ఎగబాకుతుండడంతో బ్యాంకు రుణాల మంజూరు ప్రక్రయ ఆశాజనకంగా లేకుండా పోతోంది. కొనుగోలు చేయాలనుకుంటున్న స్థిరాస్తి విలువలో 60శాతానికి మించి లోన్‌ రావడం లేదని ఆశావహులు ఆందోళన చెందుతున్నారు.

- Advertisement -

దీంతో కొనాలన్న ఆసక్తి బలంగా ఉన్నా.. మధ్యతరగతి వర్గాలకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. హైదరాబాద్‌ నగర సమీపంలో నిర్మిస్తున్న ఇళ్ళ ధరలైతే అందనంత స్థాయికి పెరిగిపోతున్నాయి. దీంతో సంపన్న వర్గాలు అవసరం లేకున్నా కొనుగోలు చేసి ధరలు పెరిగిన తర్వాత అమ్ముకునే ఆలోచనతో ముందడుగు వేస్తున్నారు. నిర్మాణ రంగం నానాటికీ ప్రియం అవుతుండడం, అదే సమయంలో వడ్డీ పెరుగుదల కొనుగోళ్లను దూరం చేస్తోంది. కొనుగోలు దారుల ఆసక్తే అదునుగా ధరలు పెంచేస్తున్న రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు ఇదే అదునుగా ఆసక్తిగా ముందుకొస్తున్న మధ్యవర్తులకు అమ్మేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

ఊహించనంతగా విస్తరిస్తున్న నగరాల్లో దేశంలోనే ప్రముఖ స్థానం సంపాదించుకున్న హైదరాబాద్‌ నగరంలో గత మూడు, నాలుగు నెలలుగా పరిశీలిస్తే మధ్యతరగతి వర్గాలు కొనుగోలు చేసే ఇళ్ల విక్రయాలు దాదాపు 50శాతం పడిపోయాయి. గృహ రుణాల వడ్డీ, స్థిరాస్తి ధరలు పెరగడంతో ఈ పరిస్థితి నెలకొంది. నిర్మాణ రంగంలో ఐదు దశాబ్ధాల అనుభవం ఉన్న ప్రముఖ స్థిరాస్థి కన్సల్టెన్సీ సంస్థ ‘ఫ్రాంక్‌ నైట్‌’ జరిపిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో రూ.2,816 కోట్లు విలువైన 5,274 ఇళ్లు అమ్ముడు పోయినట్లు ఆ సంస్థ వెల్లడించింది. రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల మధ్య విలువ చేసే గృహాలు రికార్డు స్థాయిలో 51 శాతం అమ్ముడుపోగా, 1000 నుంచి 2000 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఇళ్లు అత్యధికంగా 68 శాతం కొనుగోళ్ళు జరిగాయి. రానురాను హైదరాబాద్‌ మహానగరం చుట్టూ ఇళ్ల విక్రయాలు క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశాలున్నట్లు నిపుణులు వెల్లడిస్తున్నారు.

గృహ రుణాల వడ్డీ రేట్లు, స్థిరాస్తుల ధరలు విపరీతంగా పెరగడంతో అమ్మకాలు ఆశించినంత స్థాయిలో లేవని చెబుతున్నారు. 2021 ఫిబ్రవరితో పోలిస్తే దాదాపు 25 శాతం విక్రయాలు పడిపోయినట్లు నైట్‌ఫ్రాంక్‌ సంస్థ వెల్లడించింది. 2021 ఫిబ్రవరిలో రూ.2,939 కోట్లు- విలువైన 6,877 ఇళ్ల విక్రయాలు జరిగితే.. గతేడాది ఫిబ్రవరిలో రూ.2,816 కోట్ల విలువైన 5,274 గృహ యూనిట్లు అమ్ముడుపోయాయి. గత నెలలో అమ్ముడుపోయిన గృహాలను విలువ వారీగా చూసినట్లయితే.. రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల మధ్య 51 శాతం ఉన్నాయి. రూ.25 లక్షల కంటే తక్కువ విలువైనవి కేవలం 18 శాతం ఉన్నాయి. ఇక రూ.50 లక్షల నుంచి రూ.2 కోట్లు.. అంతకంటే ఎక్కువ విలువైనవి 31 శాతంగా ఉన్నట్లు ఆ సంస్థ వెల్లడించింది.

అదే సమయంలో వాటి విస్తీర్ణాలను పరిశీలిస్తే.. 1000 చదరపు అడుగుల లోపు విస్తీర్ణం కలిగినవి 21 శాతం ఉండగా.. 1000 నుంచి 2000 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగినవి రికార్డు స్థాయిలో 68 శాతం ఉన్నాయి. 2 వేల నుంచి 3 వేల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగినవి 9 శాతం, మూడు వేల చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణం కలిగినవి కేవలం 2 శాతం ఉన్నాయి. అత్యధికంగా మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా పరిధిలో 43 శాతం ఇళ్లు అమ్ముడుపోతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో 39 శాతం, హైదరాబాద్‌ జిల్లా పరిధిలో 15 శాతం, సంగారెడ్డి జిల్లా పరిధిలో కేవలం మూడు శాతం ఇళ్లు అమ్ముడుపోయాయి. పెరిగిన ధరలను జిల్లాల వారీగా పరిశీలిస్తే.. హైదరాబాద్‌, సంగారెడ్డి జిల్లాల్లో 9 శాతం, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో 5 శాతం పెరిగితే.. రంగారెడ్డి జిల్లాలో 1 శాతం ధరలు తగ్గినట్లు సర్వేలో తేలింది.

ఈ క్రమంలో రెపో ఆధారిత గృహ రుణాల రేటును భారతీయ స్టేట్‌ బ్యాంక్‌తో పాటు అనేక బ్యాంకులు 30 బేసిస్‌ పాయింట్ల వరకు పెంచేశాయి. దీంతో పాటు ఆస్తిని తనఖా పెట్టుకుని ఇచ్చే వ్యక్తిగత రుణాలపైనా వడ్డీరేట్లను 30 బేసిస్‌ పాయింట్ల మేర పెంచాయి. బాహ్య బెంచ్‌మార్క్‌ వడ్డీ రేట్లను(ఈబీఆర్‌) మాత్రం 7.05 వద్ద స్థిరంగా ఉంచింది. కానీ అది మధ్యతరగతి వర్గాలకు ఏమాత్రం ఉపయోగకరంగా లేదని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రుణ గ్రహీతలు, రియల్టీ సంస్థల నుంచి క్రెడిట్‌ రిస్క్‌ పెరిగే అవకాశం ఉందన్న మార్కెట్‌ వర్గాల విశ్లేషణల నేపథ్యంలో బ్యాంకులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎస్‌బీఐని ఇతర బ్యాంకులు కూడా అనుసరిస్తూ వ్యాపార లావాదేవీలను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాయని బ్యాంకింగ్‌ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement