Thursday, May 2, 2024

శ్రీలంకలో ముదురుతున్న ఆర్థిక సంక్షోభం.. మ‌రింత పెరిగిన పెట్రోల్​ డీజిల్​ ధ‌ర‌లు..

శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం మరింతగా ముదురుతోంది. శ్రీలంక చరిత్రలోనే దారుణమైన ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోంది. విదేశీ మారక ద్రవ్యం లేకపోవడం వ‌ల్ల‌ పెట్రోల్, డీజిల్ దిగుమతులు తగ్గిపోవ‌డంతో తీవ్ర కొరత నెలకొంది. ఆర్థిక సంక్షోభాన్ని తగ్గించే లక్ష్యంతో యునైటెడ్ స్టేట్స్ నుండి అధికారులు వ‌చ్చారు.. ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడేందుకు సాయం చేయాలన్న విజ్ఞప్తి మేరకు అమెరికా ఆర్థిక, విదేశాంగ శాఖల అధికారులు శ్రీలంకలో పర్యటిస్తున్నారు. ఈమేర‌కు శ్రీలంక ప్ర‌భుత్వం ఆదివారం ఇంధన ధరలను పెంచింది, సాధారణ ప్రజలపై మరింత భారం వేసింది. ఆర్థిక సంక్షోభం కారణంగా శ్రీలంక విదేశాల నుంచి చేసుకునే దిగుమతులకు డబ్బులు చెల్లించలేకపోతోంది. భారత్ సహా వివిధ దేశాలు అందిస్తున్న రుణాలు, ఆర్థిక సాయంతో గడుపుతోంది. కొద్దికొద్దిగా చమురు దిగుమతులు జరుగుతున్నాయి.

ఈ క్రమంలో తాజా దిగుమతులు ఆలస్యం అవుతుండటంతో ధరలు పెంచాల్సి వచ్చిందని శ్రీలంక చమురు మంత్రిత్వ శాఖ మంత్రి కాంచన విజేశేఖర తెలిపారు. శ్రీలంక ప్రభుత్వం పెట్రోలియం సంస్థ సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ ఆదివారం పెట్రోల్, డీజిల్ ధరలను ఏకంగా 22 శాతం పెంచేసింది. దీనితో అక్కడి కరెన్సీ ప్రకారం.. లీటర్ పెట్రోల్ ధర రూ.550కు, డీజిల్ రూ.460కి చేరాయి. ధరలు పెంచడం, కొరతపై ప్రజలకు క్షమాపణ చెప్పారు. వాహనదారులెవరూ బంకుల ముందు క్యూలు కట్ట వద్దని విజ్ఞప్తి చేశారు. అసలే ఆర్థిక సమస్యలతో కకావికలం అవుతున్న పేదలు, మధ్య తరగతి వారిపై ఇది మరింత భారం మోపుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. బంకుల్లో పెట్రోల్, డీజిల్ లేకపోవడంతో.. చాలా మంది ప్రజలు బంకుల ముందు క్యూలలో వాహనాలు పెట్టేసి వెళ్లిపోతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement