Wednesday, May 8, 2024

2021 విద్యుత్‌ సవరణ చట్టాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలి.. టీఈఈఏ అధ్యక్షుడు శివాజీ

హెదరాబాద్‌, ఆంధ్రప్రభ : విద్యుత్‌ సవరణ చట్టం -2021కు పార్లమెంట్‌లో తీసుకొస్తామని కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్‌ ప్రకటించడం దుర్మార్గమని, ఆ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని విద్యుత్‌ ఉద్యోగ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. శుక్రవారం తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్‌ అసోషియేషన్‌ సమావేశం ఆ సంఘం అధ్యక్షులు ఎన్‌ . శివాజీ అధ్యక్షతన సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2021- విద్యుత్‌ సవరణ చట్టం ప్రజలకు , విద్యుత్‌ ఉద్యోగులు, విద్యుత్‌ సంస్థల పట్ల మరణ శాసన కానున్నదని, ఆ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. రాజ్యాంగ ప్రకారం విద్యుత్‌ అనేది ఉమ్మడి జాబితాలోని అంశం కాబట్టి.. తెలంగాణ అసెంబ్లిలో చేసిన తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని ఆయన కోరారు. తెలంగాణ అసెంబ్లి తీర్మానాన్ని పరిగణలోకి తీసుకోకుండా పార్లమెంట్‌లో కేంద్రం చట్టం తీసుకుకొచ్చేందుకు ప్రయత్నిస్తే విద్యుత్‌ ఉద్యోగులందరం ప్రతిఘటిస్తామని శివాజీ హెచ్చరించారు.

విద్యుత్‌ పంపిణీ సంస్థలను ప్రయివేట్‌ వ్యక్తులకు అప్పజెప్పడానికే కేంద్రం కుట్రలు చేస్తోందన్నారు. విద్యుత్‌ సవరణ చట్టాన్ని వ్యతిరేకించిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో విద్యుత్‌ ఇంజినీర్లు తుల్జారాంసింగ్‌, బందెల రవి, సంపత్‌కుమార్‌, పున్నా నాయక్‌, లక్ష్మయ్య, సుశీల్‌కుమార్‌, తిరుపతయ్య, వెంకట్రామయ్య తదిరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement