Friday, April 26, 2024

Big Story: ఫార్మాసిటీకి టెండర్ల గండం.. వ్యర్థాల శుద్ధి ప్లాంటు నిర్మాణానికి ముందుకు రాని సంస్థలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ శివార్లలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఫార్మాసిటీకి టెండర్ల గండం వచ్చిపడింది. అభివృద్ధిపనులకు సంబంధించి ఎన్నిసార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టు ఏజెన్సీలు ముందుకు రాకపోవడంతో టీఎస్‌ఐఐసీ టెండర్ల గడువు తేదీలను సంవత్సరాల తరబడి పొడిగిస్తోంది. ఫార్మాసిటీలో ఫార్మాసుటికల్‌ ఉత్పత్తుల తయారీ కంపెనీల నుంచి వెలువడే వ్యర్థాలను శుద్ధి చేసే కామన్‌ ఎఫ్లూయెంట్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌(సీఈటీపీ) నిర్మాణానికి కాంట్రాక్టు సంస్థలు ముందుకు రాక టీఎస్‌ఐఐసీ ఈ టెండరు గడువును తాజాగా 15వ సారి పొడిగించింది. డిసెంబరు 22వ తేదీ తుదిగడువుగా తెలిపింది. తొలిసారిగా ఈ టెండరును 2021 జులైలో టీఎస్‌ఐఐసీ పిలిచింది.

రూ.500 కోట్లతో ఈ సీఈపీటీ ప్లాంటును టీఎస్‌ఐఐసీ నిర్మిస్తోంది. పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్ట్‌నర్‌షిప్‌(పీపీపీ) పద్ధతిలో నిర్మించనున్న ఈ సీఈపీటీ ప్లాంటు ఫార్మాసిటీ మౌళిక సదుపాయాల్లో చాలా కీలకమైంది. ఫార్మాసిటీ నుంచి చుట్టుపక్కల ప్రాంతాలకు ఎలాంటి ద్రవ వ్యర్థాలు విడుదల కాకుండా ఈ ప్లాంటు శుద్ధి చేస్తుంది. అయితే ఈ ప్లాంటు నిర్మాణం ఆలస్యమవుతుండడం కొంత ఆందోళన కలిగించే విషయమేనని తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ ఏడాది చివరికి ఫార్మాసిటీని ప్రారంభించే ఏర్పాట్లలో ప్రభుత్వం నిమగ్నమై ఉన్నట్లు పరిశ్రమ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రాయానికి అతి సమీపంలో 40 కిలోమీటర్ల దూరంలోని రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల, కందుకూరు తదితర పలు మండలాల్లోని 20 వేల ఎకరాల్లో ఫార్మాసిటీని టీఎస్‌ఐఐసీ అభివృద్ధి చేస్తోంది.

ఫార్మాసిటీ మొదటి దశ ప్రారంభానికి అవసరమైన సుమారు 10 వేల ఎకరాల భూ సేకరణ ఇప్పటికే పూర్తయింది. ఈ భూమికి సంబంధించి అభివృద్ధి పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. అయితే ఫార్మాసిటీ తొలి దశను లాంఛనంగా ప్రారంభించిన తర్వాతే అక్కడ కంపెనీలకు భూముల కేటాయింపు ప్రారంభమవనున్నట్లు పరిశ్రమల శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ తంతు మొత్తం ముగిశాకే ఫార్మాసిటీ రెండో దశ భూ సేకరణ ప్రారంభమవనున్నట్లు తెలుస్తోంది. తొలి దశ భూ కేటాయింపులకు కంపెనీల నుంచి ఫుల్‌ డిమాండ్‌ ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఫార్మాసిటీ తొలి దశ ప్రారంభమైన తర్వాత కంపెనీలకు భూ కేటాయింపులు జరపడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఫార్మాసిటీ ప్లాట్ల కోసం మల్టి నేషనల్‌ కంపెనీల(ఎంఎన్‌సీ) నుంచి మొదలుకుని లోకల్‌ మిడ్‌ సైజ్‌ ఫార్మా కంపెనీల దాకా టీఎస్‌ఐఐసీ వద్ద క్యూ కట్టినట్లు తెలుస్తోంది. కొన్ని వందల కంపెనీల దాకా భూముల కోసం దరఖాస్తులు పెట్టుకున్నట్లు టీఎస్‌ఐఐసీ ఉన్నతాధికారులు చెబుతున్నారు.

భూ సేకరణకు భారీ ఖర్చు…

- Advertisement -

ఫార్మాసిటీకి అవసరమైన తొలి దశ పది వేల ఎకరాలు సేకరించేందుకుగాను ప్రభుత్వం ఇప్పటికే రూ.2 వేల కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. టీఎస్‌ఐఐసీ నోడల్‌ ఏజెన్సీగా రెవెన్యూ శాఖ నష్టపరిహారం చెల్లించి సంబంధిత గ్రామస్తుల నుంచి భూములు సేకరించింది. అయితే ఈ భూ సేకరణకు సంబంధించి పలువురు కోర్టుకెళ్లడంతో వివాదాలు తలెత్తడంతో వీటిని పరిష్కరించడానికి ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఫార్మాసిటీ ఒకసారి ప్రారంభమైన తర్వాత రంగారెడ్డి జిల్లా ఆర్థిక ముఖ చిత్రం మారిపోతుందని, వేలాది ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని అధికారులు చెబుతున్నారు. ఫార్మాసిటీలోని కంపెనీల వల్ల ఎలాంటి చుట్టుపక్కల గ్రామాలకు కాలుష్యం లేకుండా జీరో లిక్విడ్‌ డిశ్చార్జ్‌ వంటి అత్యాధునిక సాంకేతికతో ఈ పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేస్తుండడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement